Yograj Singh: అభిషేక్, గిల్పై యోగరాజ్ సింగ్ ఫైర్: ఆట కంటే ఆఫ్ఫీల్డ్కే ఎక్కువ ప్రాధాన్యం?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి అయిన యోగరాజ్ సింగ్, యువ క్రికెటర్ల ప్రవర్తనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేసి మెరుపులు మెరిపించినప్పటికీ, అతని ఆట శైలి, ధోరణిపై యోగరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్లకు యువరాజ్ సింగ్ మార్గదర్శకత్వం అందిస్తున్నప్పటికీ, యోగరాజ్ వారిపై విమర్శలు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాలు
'ఆటను సీరియస్గా తీసుకోవడం లేదు'
ఓ ఇంటర్వ్యూలో యోగరాజ్ మాట్లాడుతూ..అభిషేక్ శర్మ ప్రదర్శన తనను సంతృప్తిపరచలేదన్నారు. కొన్నిసార్లు అతనికి సందేశాలు పంపి ఆటను సీరియస్గా తీసుకోవాలని చెప్పానన్నారు. కానీ అతను ఎప్పుడూ గాల్లోకి షాట్లు ఆడుతూ, సిక్సర్లతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకుంటాడని అన్నారు. క్రికెట్లో సింగిల్స్, డబుల్స్ కూడా చాలా ముఖ్యం. అవసరమైనప్పుడు రక్షణాత్మకంగా కూడా ఆడాలన్నారు. యువరాజ్ స్థాయిని చేరుకోవడం అతనికి చాలా కష్టమయ్యే విషయం అని స్పష్టం చేశారు.
వివరాలు
సాధన చేయకుండా ఆ పనులెందుకు?
శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మల పరిస్థితి ఎందుకు ఇలా మారింది? పార్టీలు, అమ్మాయిలతో గడపడం, డబ్బు, ఎప్పటికప్పుడు షూటింగ్లు—ఇవన్నీ ఆటపై దృష్టి చెదరగొడతాయన్నారు. మనసు పూర్తిగా ఆటపై లేకపోతే ఫలితాలు కూడా దెబ్బతింటాయని సూచించారు. అభిషేక్ విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోందని, రీల్స్ చేయడం అతని బాధ్యత కాదని, రాత్రి తొందరగా నిద్రపోయి, ఉదయం త్వరగా లేచి వేలాది బంతులతో సాధన చేయాలని సూచించారు. ఇక ఇదే సందర్భంలో రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై కూడా యోగరాజ్ అసహనం వ్యక్తం చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో అర్జున్ టెండూల్కర్కు స్థానం దక్కదని అశ్విన్ చెప్పడాన్ని ఆయన ఖండించారు.