Dubai Airport: దుబాయ్ ఎయిర్పోర్ట్లో కొత్త ప్రయోగం.. 15 సెకన్లలోనే ఇమ్మిగ్రేషన్ పూర్తి
ఈ వార్తాకథనం ఏంటి
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు ఇమ్మిగ్రేషన్ అనుభవాన్ని మరింత సులభతరం చేసే కొత్త సేవ అందుబాటులోకి వచ్చింది. రద్దీ సమయాలు, అత్యవసర పరిస్థితుల్లో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జీడీఆర్ఎఫ్ఏ) 'క్లిక్ & ట్రావెల్' పేరుతో మొబైల్ సర్వీస్ను ప్రారంభించింది. ఈ విధానంలో ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. పాస్పోర్ట్ కంట్రోల్ అధికారులు ప్రయాణికులు ఉన్న ప్రదేశానికే చేరుకుని ఎంట్రీ లేదా డిపార్చర్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
వివరాలు
ఎలా పనిచేస్తుంది?
'క్లిక్ & ట్రావెల్' సేవ కోసం ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రత్యేక మొబైల్ పరికరాలను వినియోగిస్తారు.
ఇవి జీడీఆర్ఎఫ్ఏకు చెందిన కేంద్ర వ్యవస్థలు, డేటాబేస్లతో అనుసంధానమై ఉంటాయి.
దీంతో ప్రయాణికుల వివరాలను అధికారులు అక్కడికక్కడే యాక్సెస్ చేయగలుగుతారు.
బయోమెట్రిక్ వెరిఫికేషన్ సాంకేతికత ద్వారా ప్రయాణికుడి గుర్తింపును ధ్రువీకరించిన అనంతరం ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
ఈ మొత్తం ప్రక్రియకు కేవలం 12 నుంచి 15 సెకన్ల సమయం పడుతుందని జీడీఆర్ఎఫ్ఏ అధికారులు తెలిపారు.
మొబైల్ వ్యవస్థ అందుబాటులో ఉండటంతో అధికారులు టెర్మినల్లోని వివిధ ప్రాంతాలకు సులభంగా వెళ్లి ప్రయాణికులకు అక్కడికక్కడే సేవలు అందించగలుగుతారు.
వివరాలు
ఎవరెవరికి ఈ సేవ?
ప్రస్తుతం 'క్లిక్ & ట్రావెల్' సేవ ప్రయాణికులు దుబాయ్కు వస్తున్నారా లేదా అక్కడి నుంచి బయలుదేరుతున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
బయలుదేరే ప్రయాణికులకు:
యూఏఈ పౌరులు, నివాసితులు, సందర్శకులు సహా అన్ని వర్గాల ప్రయాణికులకు ఈ సేవ అందుబాటులో ఉంటుంది.
అంటే దుబాయ్ నుంచి బయలుదేరే ప్రయాణికులు అవసరమైన సందర్భాల్లో ఈ మొబైల్ ఇమ్మిగ్రేషన్ సేవను పొందవచ్చు.
వచ్చే ప్రయాణికులకు:
ప్రస్తుతం తొలి దశలో యూఏఈ పౌరులు, నివాసితులకు మాత్రమే ఈ సేవను అందిస్తున్నారు.
కార్యాచరణ అవసరాలు, భవిష్యత్తు ప్రణాళికలను పరిగణనలోకి తీసుకుని ఇతర దేశాల ప్రయాణికులకు కూడా సేవలను విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
ప్రత్యేక పరిస్థితుల్లో కీలకంగా..
ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగినప్పుడు, విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు లేదా ఇతర కార్యాచరణ ఒత్తిళ్లు ఎదురైన సమయంలో 'క్లిక్ & ట్రావెల్' సేవను ప్రధానంగా ఉపయోగించనున్నారు.
దీనివల్ల ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడంతో పాటు, ప్రయాణికులు క్యూలలో వేచి ఉండే సమయం కూడా గణనీయంగా తగ్గుతుంది.
పైలట్ దశలోనే 31,373 లావాదేవీలు
'క్లిక్ & ట్రావెల్' పైలట్ కార్యకలాపాలు 2026 మేలో ప్రారంభమయ్యాయి.
అప్పటి నుంచి ఆగస్టు 31, 2026 వరకు ఈ సేవ ద్వారా మొత్తం 31,373 లావాదేవీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు జీడీఆర్ఎఫ్ఏ వెల్లడించింది.
వివరాలు
ప్రయాణికుల వద్దకే ఇమ్మిగ్రేషన్..
సాధారణంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కోసం ప్రయాణికులే కౌంటర్ల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.
అయితే'క్లిక్ & ట్రావెల్'విధానంలో పరిస్థితి మారుతుంది.ఇమ్మిగ్రేషన్ సేవలే ప్రయాణికులు ఉన్న చోటికి చేరుకుంటాయి.
"సాధారణంగా ప్రయాణికులే ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్దకు వస్తారు.కానీ 'క్లిక్ & ట్రావెల్' ద్వారా ఇమ్మిగ్రేషన్ సేవలను ప్రయాణికుల వద్దకే తీసుకెళ్తున్నాం.
ఇది కేవలం విధానాలను మెరుగుపరచడం మాత్రమే కాదు..ప్రయాణికుల అనుభవాన్ని పూర్తిగా పునఃరూపకల్పన చేయడమే"అని దుబాయ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అహ్మద్ అల్ మర్రి తెలిపారు.
భవిష్యత్తులో ఈసేవ పరిధిని మరింత విస్తరించే అంశంపై దృష్టి సారిస్తున్నట్లు ఆయన చెప్పారు.
మొబైల్ పరికరాల ద్వారా ప్రయాణికులకు మరిన్ని రకాల సేవలను అందించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.