Loading...
Vienna museum: వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల వజ్రాల హారం చోరీ
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల వజ్రాల హారం చోరీ

Vienna museum: వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల వజ్రాల హారం చోరీ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2026
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

వియన్నాలోని మ్యూజియంలో పట్టపగలు భారీ చోరీ చోటుచేసుకుంది. ఈజిప్టు మాజీ రాణి నజ్లీకి చెందిన అరుదైన వజ్రాల హారాన్ని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. సుమారు 4.3 మిలియన్ డాలర్లు (రూ.38 కోట్లకు పైగా) విలువైన ఈ నెక్లెస్‌ను ఆగస్టు 27న మ్యూజియం ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్‌లో దొంగిలించారు. దుండగులు సాధారణ సందర్శకుల్లాగే మ్యూజియంలోకి ప్రవేశించారు. ఇద్దరూ టికెట్లు కొనుగోలు చేసి వజ్రాల ఆభరణాలను ప్రదర్శిస్తున్న ప్రాంతానికి వెళ్లారు. వారిద్దరూ ముఖాలకు మాస్కులు కూడా ధరించలేదు. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో వారి కదలికలు స్పష్టంగా నమోదయ్యాయి. హారం ప్రదర్శిస్తున్న ప్రదేశానికి చేరుకున్న వెంటనే వారిలో ఒకరు సుత్తితో గాజు డిస్‌ప్లే కేసును పగులగొట్టాడు.

వివరాలు 

673 వజ్రాలతో ప్రత్యేకమైన హారం

అనంతరం అందులో ఉన్న విలువైన హారాన్ని తీసుకుని ఇద్దరూ మ్యూజియం నుంచి కాలినడకన బయటకు వెళ్లిపోయారు.

నిందితుల్లో ఒకరి వద్ద తుపాకీ ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

చోరీకి గురైనది సాధారణ ఆభరణం కాదు. ప్లాటినంతో రూపొందించిన ఈ నెక్లెస్ ఆర్ట్ డెకో శైలికి చెందిన అరుదైన ఆభరణం. ఇందులో ఏకంగా 673 వజ్రాలు ఉన్నాయి.

వీటిలోని రత్నాల మొత్తం బరువు 200 క్యారెట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ విలువైన హారాన్ని ఈజిప్టు రాణి నజ్లీ కోసం ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఆభరణాల సంస్థ 'వాన్ క్లీఫ్ అండ్ అర్పెల్స్' 1930ల చివర్లో రూపొందించింది.

వివరాలు 

ఇద్దరు అనుమానితుల కోసం భారీ గాలింపు

నెక్లెస్ మధ్యలో పెద్ద వజ్రాన్ని అమర్చారు. దాని చుట్టూ బాగెట్-కట్, బ్రిలియంట్-కట్ వజ్రాలను సూర్యకిరణాల ఆకృతిలో అమర్చి ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

చోరీపై కేసు నమోదు చేసిన ఆస్ట్రియా పోలీసులు ఇద్దరు అనుమానితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

వారి ఆచూకీ కోసం ట్రాకర్ డాగ్స్‌ను కూడా రంగంలోకి దించారు.

మ్యూజియంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

చోరీకి గురైన హారం దేశం దాటి తరలించే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

విలువైన కళాఖండాలు, ఆభరణాల చోరీలు యూరప్‌లో తరచూ వెలుగుచూస్తున్నాయి.

ఇటీవల ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ తదితర దేశాల్లోనూ ఖరీదైన కళాఖండాలు, ఆభరణాలు చోరీకి గురైన ఘటనలు నమోదయ్యాయి.

ADVERTISEMENT