Bahrain: బహ్రెయిన్లో అమెరికా నేవీ కీలక స్థావరంపై ఇరాన్ దాడి.. లాజిస్టిక్స్ కేంద్రం ధ్వంసం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ సైనిక దాడులు మొదలవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమెరికా చేపట్టిన దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో బహ్రెయిన్లో ఉన్న అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడుల కారణంగా అమెరికా నేవీకి చెందిన నేవల్ సపోర్ట్ యాక్టివిటీ బహ్రెయిన్ (NASB) తీవ్రంగా దెబ్బతిన్నట్లు యూఎస్ నేవీ తాత్కాలిక కార్యదర్శి హంగ్కావో వెల్లడించారు. పశ్చిమాసియాలో అమెరికా నౌకాదళ కార్యకలాపాలకు NASB అత్యంత కీలకమైన లాజిస్టిక్స్ కేంద్రంగా వ్యవహరిస్తోంది. నౌకాదళ కార్యకలాపాలకు అవసరమైన మద్దతు, సరఫరాల విషయంలో ఈ స్థావరం ప్రాధాన్యం కలిగి ఉంది.
వివరాలు
పూర్తిగా దెబ్బతిన్న NASBలోని మౌలిక సదుపాయాలు
ఫిబ్రవరిలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి బహ్రెయిన్లోని ఈ కీలక స్థావరం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లక్ష్యంగా మారింది.
ఇప్పటివరకు పలుమార్లు దానిపై దాడులు జరిగాయి. తాజాగా జరిగిన దాడుల్లో NASBలోని మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం.
స్థావరాన్ని పునరుద్ధరించాలా లేదా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలా అనే అంశంపై ప్రస్తుతం పరిశీలన జరుగుతోందని హంగ్కావో తెలిపారు.
NASB భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే క్రమంలో అందుబాటులో ఉన్న ఇతర ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదే సమయంలో బహ్రెయిన్లోని ఇతర అమెరికా సైనిక స్థావరాలపైనా ఇరాన్ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
జోర్డాన్లోనూ అమెరికా స్థావరంపై దాడులు
ఇరాన్ దాడులు బహ్రెయిన్కే పరిమితం కాలేదు. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాన్ని కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది.
ఈ దాడుల్లో పలు అమెరికా సైనిక విమానాలు దెబ్బతిన్నాయి. ఏ-10 థండర్బోల్ట్ విమానంతో పాటు ఎనిమిది ఎఫ్-15 యుద్ధ విమానాలకు స్వల్ప నష్టం వాటిల్లినట్లు సమాచారం.
ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు అమెరికా బలగాలు జోర్డాన్లో 30 పాట్రియాట్ క్షిపణులను మోహరించాయి.
గగనతల రక్షణను బలోపేతం చేయడంలో భాగంగా ఈ క్షిపణులను వినియోగించినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఇరాన్ యుద్ధ నౌకలను ధ్వంసం చేసిన అమెరికా
మరోవైపు, మంగళవారం ఇరాన్కు చెందిన ఐదు యుద్ధ నౌకలను అమెరికా బలగాలు ధ్వంసం చేశాయి.
దీనికి ప్రతిస్పందనగానే ఇరాన్ తాజాగా అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతిదాడులకు దిగినట్లు సమాచారం.
దీంతో ఇరుదేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉండగా.. ఇరాన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్న హూతీ దళాలు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.
ముఖ్యంగా ఎర్ర సముద్ర తీర ప్రాంతంలో హూతీ దళాల కదలికలు పెరిగినట్లు సమాచారం.
దీంతో గల్ఫ్ ప్రాంతంతో పాటు ఎర్ర సముద్ర పరిసరాల్లోనూ భద్రతా పరిస్థితులపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.