Loading...
Pattaya-US Sailors: పట్టాయాకు వచ్చిన అమెరికా నావికులు.. నాలుగు రోజుల్లో ఏం చేశారంటే?
పట్టాయాకు వచ్చిన అమెరికా నావికులు.. నాలుగు రోజుల్లో ఏం చేశారంటే?

Pattaya-US Sailors: పట్టాయాకు వచ్చిన అమెరికా నావికులు.. నాలుగు రోజుల్లో ఏం చేశారంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2026
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా జలాల నుంచి థాయిలాండ్‌కు చేరుకున్న అమెరికా విమాన వాహకనౌక యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌.. తాజాగా అమెరికా వైపు తిరుగు ప్రయాణమైంది. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో 250 రోజులకు పైగా సముద్రంలో విధులు నిర్వర్తించిన అమెరికా నావికులు.. విశ్రాంతి కోసం థాయిలాండ్‌లోని పట్టాయాను సందర్శించారు. వారి రాకతో పట్టాయాలో స్థానిక పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అమెరికా సైనికుల కారణంగా వ్యభిచార కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు.. సెక్స్‌వర్కర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. అయితే అమెరికా సైనికుల నాలుగు రోజుల పర్యటన మాత్రం పోలీసులు ఊహించిన దానికి భిన్నంగా సాగినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

వివరాలు 

పట్టాయాకు యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌ విమాన వాహకనౌక

సెప్టెంబర్‌ 2న యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌ విమాన వాహకనౌకతో పాటు రెండు యుద్ధ నౌకలకు చెందిన నావికులు, పైలట్లు, మెరైన్లు పట్టాయాకు చేరుకున్నారు.

థాయ్‌ రాజధాని బ్యాంకాక్‌కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం నైట్‌లైఫ్‌, బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది.

సముద్ర విధుల్లో నెలల తరబడి గడిపిన సైనికులు ఇక్కడ కొంత సమయం విశ్రాంతిగా గడిపారు.

వివరాలు 

షాపింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం

పట్టాయాకు వచ్చిన అమెరికా సైనికులు పెద్దగా హడావుడి చేయకుండా షాపింగ్‌, ఆహారం, వినోదంపై దృష్టి పెట్టినట్లు స్థానికులు తెలిపారు.

సాక్సులు, దుస్తులు, షూలు, బహుమతులు వంటి వస్తువులను కొనుగోలు చేశారు.

స్థానిక థాయ్‌ వంటకాలను రుచి చూశారు. కొందరు బార్లలోనూ సమయం గడిపారు.

చిన్నచిన్న గొడవలు మినహా ఈసారి వచ్చిన అమెరికా సిబ్బంది ఎంతో మర్యాదగా వ్యవహరించారని స్థానికులు చెప్పినట్లు మీడియా పేర్కొంది.

అమెరికా బలగాల షాపింగ్‌తో స్థానికంగా పలు వ్యాపార సంస్థలకు ప్రయోజనం కలిగింది.

ముఖ్యంగా ఆహారం, దుస్తులు, పాదరక్షలు, బహుమతుల కొనుగోళ్లకు సైనికులు ఎక్కువగా ఖర్చు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది.

దీంతో నైక్‌, విక్టోరియాస్‌ సీక్రెట్‌, స్టార్‌బక్స్‌ వంటి అంతర్జాతీయ బ్రాండ్ల కార్యకలాపాలు కూడా పెరిగినట్లు పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

మత్స్యకారుల గ్రామం నుంచి పర్యాటక కేంద్రంగా..

ఒకప్పుడు పట్టాయా సాధారణ మత్స్యకారుల గ్రామంగా ఉండేది.

అయితే వియత్నాం యుద్ధం తర్వాత ఆ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

అప్పట్లో థాయ్‌లాండ్‌లో మోహరించిన అమెరికా సైనికులు విశ్రాంతి, వినోదం కోసం పట్టాయాకు వచ్చేవారు.

అమెరికా సైనికుల రాకతో అక్కడ వినోద, పర్యాటక కార్యకలాపాలు క్రమంగా పెరిగాయి.

కాలక్రమంలో పట్టాయా ఓ చిన్న మత్స్యకారుల గ్రామం నుంచి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పర్యాటక, వినోద కేంద్రంగా రూపాంతరం చెందింది.

ప్రస్తుతం బీచ్‌లు, నైట్‌లైఫ్‌, షాపింగ్‌ వంటి వాటికి ఈ నగరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ADVERTISEMENT