Yemen,Somalia: 22 మంది భారతీయులతో వెళ్తున్న రెండు నౌకలు హైజాక్.. ఎక్కడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
సోమాలియా, యెమెన్ తీరాల్లో వేర్వేరుగా జరిగిన రెండు ఘటనల్లో 22 మంది భారతీయులు ఉన్న రెండు వాణిజ్య నౌకలను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఈ విషయాన్ని సోమాలియా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండు నౌకల్లోని సిబ్బంది ప్రస్తుతం పైరేట్స్ చెరలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని సురక్షితంగా విడిపించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
వివరాలు
లుటుఫ్ నౌక హైజాక్
ఆగస్టు 17న సోమాలియా తీరంలో కామెరూన్ జెండాతో ప్రయాణిస్తున్న 'లుటుఫ్' అనే కార్గో నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.
ఈ నౌక తుర్కియే నుంచి ఆయుధాలను తరలిస్తోంది. మొత్తం 10 మంది సిబ్బంది ఉండగా.. వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నారు.
మిగిలిన నలుగురు తుర్కియే, జార్జియా, సెర్బియాకు చెందినవారు.
మొగదిషూలోని సైనిక శిక్షణా కేంద్రానికి ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు, శాటిలైట్ పరికరాలను తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రెండు చిన్న పడవల్లో వచ్చిన ఎనిమిది మంది సాయుధులు నౌకలోకి ప్రవేశించి దానిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
ఎం టి సిబు 1 ట్యాంకర్ కూడా హైజాక్
ఆగస్టు 20న మరో హైజాక్ ఘటన యెమెన్ తీరానికి సమీపంలో చోటుచేసుకుంది.
ఎరిట్రియా జెండాతో ప్రయాణిస్తున్న 'ఎం టి సిబు 1' అనే చమురు ఉత్పత్తుల ట్యాంకర్ను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.
ఈ నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 16 మంది భారతీయులు ఉన్నారు.
మిగిలిన సిబ్బంది సిరియా, సూడాన్, ఇరాక్ దేశాలకు చెందినవారు. ప్రస్తుతం రెండు నౌకల్లోని సిబ్బంది సముద్రపు దొంగల చెరలోనే ఉన్నారు.
ఈ రెండు ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోందని సోమాలియా అధికారులు తెలిపారు.
నౌకల్లోని నావికులను పైరేట్స్ నుంచి సురక్షితంగా విడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఈ ఘటనలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.