Bangladesh: బంగ్లాదేశ్లో కొనసాగుతున్న దాడులు.. మరో హిందువు దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా స్థానికుల దాడిలో జై మహాపాత్ర అనే మరో హిందువు మృతిచెందినట్లు (Hindu Man Killed In Bangladesh) మీడియా వర్గాలు వెల్లడించాయి. మీడియా కథనాల ప్రకారం సునమ్గంజ్ జిల్లాలోని భంగాడోహోర్ గ్రామంలో ఆర్థిక లావాదేవీల అంశాన్ని ఆధారంగా చేసుకుని గురువారం 19 ఏళ్ల జై మహాపాత్రపై అమీరుల్ ఇస్లాం అనే వ్యక్తి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహాపాత్రను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందినట్లు సమాచారం. బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య అనంతరం దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
Details
హిందువులపై వరుస దాడులు
ఆ ఘటన తర్వాత నుంచి దేశవ్యాప్తంగా హిందువులపై వరుస దాడులు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే పలువురు హిందువులు ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రైస్తవ ఐక్యతా మండలి విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత డిసెంబర్ నెలలో మాత్రమే హిందువులపై 51 హింసాత్మక ఘటనలు నమోదైనట్లు వెల్లడించింది. ఈ పరిణామాలు దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయన్న ఆందోళనలను కలిగిస్తున్నాయి.