Putin-Modi: భారత్పై ఆంక్షల ఆలోచన మానుకోండి.. పుతిన్ ఘాటు వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం తన జాతీయ ప్రయోజనాల విషయంలో ఎలాంటి బాహ్య ఒత్తిళ్లకూ తలొగ్గదని, ఎప్పటికప్పుడు స్వతంత్ర నిర్ణయాలనే తీసుకుంటోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. రష్యాతో సంబంధాల విషయంలో కూడా భారత్ భవిష్యత్తులో ఇదే విధానాన్ని కొనసాగిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంక్షల రూపంలో భారత్పై ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నాలు చేసే దేశాలకు కూడా ఆయన పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. సెయింట్ పీటర్స్బర్గ్లో జరుగుతున్న ఆర్థిక సదస్సులో మాట్లాడిన పుతిన్, భారత్ ఒక సార్వభౌమాధికార దేశమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత్ను ఆంక్షల పేరుతో ఎవరైనా బెదిరించాలనుకుంటే, అలాంటి చర్యలు చివరికి వారికే ఎదురుదెబ్బగా మారతాయని వ్యాఖ్యానించారు.
వివరాలు
జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు
భారత ప్రజలకు అవసరమైన, ప్రయోజనకరమైన ఉత్పత్తులను ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఆ దేశానికి ఉందని చెప్పారు. ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, భారత్ తన వ్యూహాత్మక అవసరాలు, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటోందని పుతిన్ పేర్కొన్నారు. రష్యాకు చెందిన SU-57 యుద్ధ విమానాలు, S-500 రక్షణ వ్యవస్థలను భారత్ కొనుగోలు చేస్తే అమెరికా నుంచి ఆంక్షలు ఎదురయ్యే అవకాశాలపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోందని, అదే దాని బలమని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి.
వివరాలు
మినహాయింపులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి
ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో ఇటీవల భారత్లో పర్యటించారు. భారత్ తమకు అత్యంత కీలక భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. అయితే అనంతరం అమెరికాకు తిరిగి వెళ్లిన తర్వాత భారత్కు ఇబ్బంది కలిగించేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురుపై అమల్లో ఉన్న మినహాయింపులను వీలైనంత త్వరగా తొలగించాలని అమెరికా భావిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రష్యా నుంచి దిగుమతి చేసుకునే చమురు భారత్కు ఎంతో కీలకంగా మారిన సంగతి తెలిసిందే.