China: ఎవరెస్ట్ సమీపంలో హై-ఆల్టిట్యూడ్ డ్రోన్ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన చైనా
ఈ వార్తాకథనం ఏంటి
టిబెట్లోని ఎవరెస్ట్ పర్వతం సమీపంలో చైనా ప్రత్యేక హై-ఆల్టిట్యూడ్ డ్రోన్ పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాన్ని ప్రారంభించింది. ఎత్తైన ప్రాంతాల్లో సరిహద్దు నిఘా, భద్రత, రవాణా, సరుకు సరఫరా వంటి అవసరాల కోసం మానవరహిత విమానాల (యూఏవీ) వినియోగాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 'ప్రపంచానికి పైకప్పు'గా పేరుగాంచిన టిబెట్ సముద్ర మట్టానికి సగటున 4,000 మీటర్లకు పైగా ఎత్తులో ఉంది. ఇక్కడ గాలి పలుచగా ఉండటం, ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటం, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, తరచూ మారే వాతావరణం వంటి అంశాలు ఎత్తైన ప్రాంతాల్లో పనిచేసే డ్రోన్ల పరీక్షలకు అనుకూలంగా ఉంటాయని చైనా ఇంజినీర్లు పేర్కొన్నట్లు సమాచారం.
వివరాలు
హై-ఆల్టిట్యూడ్ డ్రోన్ పరిశోధనకు తొలి ప్రత్యేక కేంద్రం
జూలై 3న లాసాలోని షిజాంగ్ విశ్వవిద్యాలయంలో 'ప్లాటో డ్రోన్ ఆర్అండ్డీ అప్లికేషన్ సెంటర్'ను ప్రారంభించారు.
ఎత్తైన పీఠభూముల్లో పనిచేసే డ్రోన్ల పరిశోధన,అభివృద్ధి,ప్రత్యక్ష వినియోగానికి అంకితమైన చైనాలోని తొలి ప్రత్యేక కేంద్రంగా ఇది నిలిచిందని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ షిన్హువా వెల్లడించింది.
ఈ కేంద్రం ద్వారా హై-ఆల్టిట్యూడ్ డ్రోన్ సాంకేతికతలో చైనా సామర్థ్యాలు మరింత పెరుగుతాయని,ఈ రంగంలో అమెరికాతో కొనసాగుతున్న సాంకేతిక పోటీలో చైనాకు అదనపు బలం చేకూరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
షిజాంగ్ విశ్వవిద్యాలయం ఇప్పటికే పీఠభూమి శాస్త్ర పరిశోధనల్లో నైపుణ్యం కలిగి ఉంది.
దేశంలోని లో-ఆల్టిట్యూడ్ ఎకానమీ అభివృద్ధి వ్యూహాలకు అనుగుణంగా, టిబెట్ ప్రాంత అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేసినట్లు షిన్హువా తెలిపింది.
వివరాలు
హై-ఆల్టిట్యూడ్ డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
అంతేకాకుండా వివిధ శాస్త్ర విభాగాల మధ్య సమన్వయంతో కొత్త సాంకేతిక ఆవిష్కరణలకు ఇది వేదికగా మారనుంది.
షిజాంగ్ విశ్వవిద్యాలయ పార్టీ కార్యదర్శి సన్ షియాన్జోంగ్ మాట్లాడుతూ, పీఠభూమి శాస్త్ర సాంకేతిక విభాగాలు, జాతీయ స్థాయి ఇంజినీరింగ్ బృందాలు, స్మార్ట్ నిర్మాణం,పీఠభూమి మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ సెంటర్ ఈ పరిశోధన కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తాయని తెలిపారు.
కృత్రిమ మేధస్సు (ఏఐ), న్యూ ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సులతో పాటు 'ప్లాటో ఇంటెలిజెంట్ లో-ఆల్టిట్యూడ్ యూఏవీ అప్లికేషన్స్' పేరుతో ప్రత్యేక మైక్రో కోర్సును కూడా ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.
భవిష్యత్తులో హై-ఆల్టిట్యూడ్ డ్రోన్ల అభివృద్ధిలో ఎదురవుతున్న కీలక సాంకేతిక సమస్యలను పరిష్కరించడంపై ఈ కేంద్రం దృష్టి సారించనుంది.
వివరాలు
ఎవరెస్ట్లో డ్రోన్లతో కొత్త అధ్యాయం
పర్యావరణ పరిరక్షణ,సరిహద్దు గస్తీ,భద్రత,రవాణా,భౌగోళిక పరిశీలన,అత్యవసర సరుకు సరఫరా వంటి రంగాలకు అనువైన సమగ్ర డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయనుంది.
ఎవరెస్ట్ ప్రాంతంలో హై-ఆల్టిట్యూడ్ డ్రోన్ కార్యకలాపాలు ప్రస్తుతం చైనా-అమెరికా మధ్య జరుగుతున్న సాంకేతిక పోటీకి కీలక పరీక్షా వేదికగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొత్త పరిశోధన కేంద్రం ప్రారంభానికి ప్రాధాన్యం ఏర్పడింది.
ఇదిలా ఉండగా,2024 నుంచి నేపాల్కు చెందిన ఎయిర్లిఫ్ట్ టెక్నాలజీ సంస్థ చైనాకు చెందిన డీజేఐ తయారు చేసిన భారీ సామర్థ్యమున్న డ్రోన్లను ఉపయోగిస్తోంది.
వీటి ద్వారా ఎవరెస్ట్ ఎగువ శిబిరాలకు అవసరమైన సరుకులను చేరవేయడంతో పాటు,అక్కడ పేరుకుపోయిన చెత్త,మానవ వ్యర్థాలను దిగువకు తరలిస్తున్నారు.
దీంతో షెర్పా గైడ్లు ఎదుర్కొనే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతున్నాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.