Pew study: 36 దేశాల సర్వేలో అమెరికాను అధిగమించిన చైనా.. ప్యూ రీసెర్చ్ కీలక నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా అమెరికా కంటే చైనాపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరుగుతోందని అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా అధ్యయనంలో వెల్లడించింది. 2002 నుంచి ప్రపంచ దేశాల్లో ప్రజల అభిప్రాయాలను పరిశీలిస్తున్న ప్యూ సంస్థ చరిత్రలో తొలిసారిగా ఇలాంటి ఫలితాలు నమోదయ్యాయని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే వరకు 36 దేశాల్లో 42 వేల మందికిపైగా పాల్గొన్న ఈ సర్వేలో, 25 దేశాల్లో అమెరికా కంటే చైనాపై ఎక్కువ మంది సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనాపై అనుకూల దృక్పథం అనేక దేశాల్లో రికార్డు స్థాయికి చేరుకోగా, అమెరికాపై ప్రజల అభిప్రాయం క్రమంగా దిగజారినట్లు నివేదిక వెల్లడించింది.
వివరాలు
అమెరికాకు మద్దతుగా ఆరు దేశాలు మాత్రమే
స్పెయిన్,ఇండోనేషియా,ఇటలీ,గ్రీస్, కెనడా వంటి దేశాల్లో చైనా పట్ల ప్రజల అభిప్రాయంలో గణనీయమైన మార్పు కనిపించింది.
మరోవైపు అమెరికాకు ఇప్పటికీ ఎక్కువ మద్దతు ఉన్న దేశాలు కేవలం ఆరు మాత్రమే.
వాటిలో పోలాండ్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, భారత్, జపాన్, ఇజ్రాయెల్ ఉన్నాయి.
ఇవన్నీ అమెరికాకు సన్నిహిత మిత్రదేశాలుగా గుర్తింపు పొందాయి. సర్వేలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్పై కూడా ప్రజల విశ్వాసాన్ని అంచనా వేశారు.
ఇద్దరు నేతలపై కూడా మొత్తం మీద విశ్వాసం తక్కువగానే ఉన్నప్పటికీ, చాలా దేశాల్లో ట్రంప్ కంటే షీ జిన్పింగ్కే ఎక్కువ మంది మద్దతు తెలిపారు.
వివరాలు
ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా ఎక్కువగా జోక్యం
షీ జిన్పింగ్కు అత్యధిక మద్దతు పాకిస్థాన్లో (83 శాతం), అత్యల్ప మద్దతు జపాన్లో (7 శాతం) నమోదైంది.
ట్రంప్కు ఫిలిప్పీన్స్లో అత్యధికంగా 68 శాతం మంది మద్దతు తెలపగా, వెస్ట్ బ్యాంక్-తూర్పు జెరూసలేం ప్రాంతంలో కేవలం 4 శాతం మంది మాత్రమే విశ్వాసం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత స్వేచ్ఛలను గౌరవించే విషయంలో అమెరికా ప్రభుత్వం ఇప్పటికీ చైనా కంటే మెరుగ్గా ఉందని ఎక్కువ మంది భావించినప్పటికీ, గతంతో పోలిస్తే ఈ తేడా తగ్గిందని అధ్యయనం తెలిపింది.
అదే సమయంలో ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా ఎక్కువగా జోక్యం చేసుకుంటుందని 75 శాతం మంది అభిప్రాయపడగా, చైనా విషయంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన వారు 45 శాతం మాత్రమే ఉన్నారు.
వివరాలు
సింగపూర్ మాత్రం చైనాపై అనుకూల దృక్పథం వ్యక్తం చేసింది
ఆదాయ స్థాయిని బట్టి కూడా ప్రజల అభిప్రాయాల్లో తేడా కనిపించింది.
మధ్యస్థ ఆదాయ దేశాలు చైనాపై ఎక్కువ సానుకూలంగా స్పందించగా, సంపన్న దేశాల్లో మాత్రం చైనాపై ప్రతికూల అభిప్రాయాలు ఎక్కువగా నమోదయ్యాయి.
అయితే తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న సింగపూర్ మాత్రం చైనాపై అనుకూల దృక్పథం వ్యక్తం చేసిన దేశాల్లో ఒకటిగా నిలిచింది.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే చైనాపై అత్యధిక, అత్యల్ప అభిప్రాయాలు నమోదయ్యాయి.
పాకిస్థాన్లో దాదాపు 90 శాతం మంది చైనాకు మద్దతు తెలపగా, జపాన్లో కేవలం 11 శాతం మంది మాత్రమే చైనాపై సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు.
వివరాలు
చైనా సాంకేతిక పురోగతి,ఆర్థిక సామర్ధ్యానికి ప్రజలు మంచి మార్కులు
ఇటీవలి కాలంలో అమెరికా విదేశాంగ విధానాల్లో చోటుచేసుకున్న అనిశ్చితి, బలప్రయోగం, ఆర్థిక ప్రభావాల కారణంగా అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు చైనా తన అంతర్జాతీయ ప్రతిష్ఠను, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, మెరుగుపరచుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అయితే చైనాపై సానుకూల అభిప్రాయం పెరగడం, షీ జిన్పింగ్ వ్యక్తిగత నాయకత్వంపై అదే స్థాయిలో విశ్వాసం ఉందని అర్థం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
చైనా సాంకేతిక పురోగతి, ఆర్థిక సామర్థ్యం వంటి అంశాలకు ప్రజలు మంచి మార్కులు ఇస్తున్నప్పటికీ, మైనార్టీల హక్కులు, కఠిన పాలన, దూకుడు విదేశాంగ విధానం వంటి అంశాలపై ఇంకా సందేహాలు కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు.