LOADING...
China: రూ.2,200 కోట్లు లంచం.. చైనా మాజీ అధికారికి మరణశిక్ష
రూ.2,200 కోట్లు లంచం.. చైనా మాజీ అధికారికి మరణశిక్ష

China: రూ.2,200 కోట్లు లంచం.. చైనా మాజీ అధికారికి మరణశిక్ష

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారీ అవినీతి కేసులో చైనా కోర్టు మాజీ నగర అధికారికి మరణశిక్ష విధించింది. దాదాపు 30 ఏళ్ల పాటు 2.2 బిలియన్ యువాన్‌లు (సుమారు 325 మిలియన్ డాలర్లు) లంచాల రూపంలో స్వీకరించినట్లు తేలడంతో ఈ తీర్పు వెలువడింది. ఈ మొత్తం భారత కరెన్సీలో సుమారు రూ.2,200 కోట్లకు పైగా ఉంటుంది. నాన్జింగ్ నగరంలో 1993 నుంచి 2023 వరకు వివిధ కీలక పదవుల్లో పనిచేసిన 69 ఏళ్ల యాంగ్ యౌలిన్‌పై లంచాలు తీసుకోవడం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్ వంటి ఆరోపణలు నమోదయ్యాయి. ఇటీవలి సంవత్సరాల్లో వెలుగులోకి వచ్చిన అతిపెద్ద అవినీతి కేసుల్లో ఇదొకటిగా చైనా అధికారులు పేర్కొన్నారు.

వివరాలు 

షీ జిన్‌పింగ్ చేపట్టిన అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగానే యాంగ్‌పై విచారణ

తాను నిర్వహించిన అధికార పదవులను అడ్డంగా పెట్టుకుని ఇంజినీరింగ్ కాంట్రాక్టులు ఇప్పించడం, భూ బదిలీలు జరిపించడం, ఆర్థిక సాయం అందేలా చూడడం వంటి పనులకు ప్రతిఫలంగా నగదు, విలువైన వస్తువులు స్వీకరించినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేపట్టిన అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగానే యాంగ్‌పై విచారణ జరిగింది. ఈ అవినీతి నిరోధక చర్యలు సైన్యం, బ్యాంకింగ్ రంగం, ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారుల వరకు విస్తరించాయి. చాంగ్‌జౌ కోర్టు సోమవారం వెలువరించిన తీర్పులో యాంగ్ చేసిన నేరాలు అత్యంత తీవ్రమైనవని పేర్కొంది. అతని చర్యల వల్ల ప్రభుత్వం, ప్రజల ప్రయోజనాలకు భారీ నష్టం వాటిల్లిందని కోర్టు వ్యాఖ్యానించింది.

వివరాలు 

1.8 బిలియన్ యువాన్‌ల లంచాల కేసులో మాజీ ఆర్థిక సంస్థ అధిపతికి ఉరిశిక్ష

అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా అవినీతి వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారు. అయితే రాజకీయ ప్రత్యర్థులను పక్కకు తప్పించడానికి కూడా ఈ చర్యలను వినియోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆర్థిక నేరాల్లో మరణశిక్షలు చైనాలో అరుదుగానే విధించినప్పటికీ, వెయ్యి కోట్ల యువాన్‌లకు పైగా అవినీతి జరిగిన కేసుల్లో అప్పుడప్పుడు ఇలాంటి శిక్షలు అమలు చేస్తున్నారు. 2021లో మాజీ ఆర్థిక సంస్థ అధిపతి లై షియావోమిన్ 1.8 బిలియన్ యువాన్‌ల లంచాల కేసులో ఉరిశిక్షకు గురయ్యారు. అలాగే 2024లో ఇన్నర్ మంగోలియా మాజీ అధికారి లీ జియన్‌పింగ్ రూ.3 బిలియన్ యువాన్‌లకు పైగా అవినీతి, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో మరణశిక్ష అమలైంది.

Advertisement

వివరాలు 

యాంగ్ నేరాలు అత్యంత తీవ్రమైనవి 

చాలా సందర్భాల్లో కోర్టులు జీవిత ఖైదు లేదా ఉరిశిక్షను నిలిపివేస్తూ తీర్పులు ఇస్తుంటాయి. అలాగే ఇతర నేరస్థుల గురించి సమాచారం అందించిన వారికి శిక్షల్లో సడలింపులు కూడా లభించిన ఉదాహరణలు ఉన్నాయి. యాంగ్ కూడా దర్యాప్తు అధికారులకు సహకరించి, తన నేరాలను అంగీకరించినప్పటికీ, అతను చేసిన నేరాలు అత్యంత తీవ్రమైనవని కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల శిక్షను తగ్గించే అవకాశం లేదని పేర్కొంది. విచారణ చివరిలో యాంగ్ తన తప్పులను అంగీకరిస్తూ పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

Advertisement