
Iran-Israel: కాల్పుల విరమణ ఉన్నా.. ఇజ్రాయెల్పై ఇరాన్ ఘోర దాడి.. ముగ్గురు దుర్మరణం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసినప్పటికీ, పరిస్థితులు శాంతించడం లేదు. 24 గంటల్లో దశలవారీగా కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ కూడా దీనిని అంగీకరించింది. అయినా కూడా ఇరాన్ మంగళవారం ఉదయం ఇజ్రాయెల్పై క్షిపణులను ప్రయోగించింది. దక్షిణ ఇజ్రాయెల్ నగరం బీర్ షెవాలోని ఓ నివాస భవనంపై ఇరాన్ క్షిపణి పడింది. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, భవనాలు, కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వీడియోలో క్షిపణి ఢీకొన్న భవనానికి నష్టం వాటిల్లినట్టు, చుట్టుపక్కల కాలిపోయిన కార్లు, చెట్ల అవశేషాలు కనిపించాయి.
Details
ప్రతీకారంగా ఇరాన్ దాడులు
ఇరాన్ క్షిపణి దాడిలో ముగ్గురు మరణించారని, ఇద్దరు గాయపడ్డారని ఇజ్రాయెల్ అత్యవసర సేవలు ధృవీకరించాయి. మరో ఆరుగురికి స్వల్ప గాయాలై, వారిని ఘటనా స్థలంలోనే చికిత్స అందించినట్టు తెలిపాయి. జూన్ 13న ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధం ప్రారంభించింది. ముఖ్యంగా అణు కేంద్రాలనే లక్ష్యంగా పెట్టుకుని దాడులను ముమ్మరం చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులను మొదలు పెట్టింది. ఈ సమయంలో అమెరికా కూడా జోక్యం చేసుకుని, ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు జరిపింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఇరాన్, అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర పరిణామాలుంటాయని ప్రకటించింది. ఆ తర్వాత పశ్చిమాసియాలో ఉన్న అమెరికా దళాలపై కూడా ఇరాన్ దాడులను జరిపింది.