LOADING...
Donald Trump Avenue: హైదరాబాద్‌లోని కీలక రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా పేరు
హైదరాబాద్‌లోని కీలక రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా పేరు

Donald Trump Avenue: హైదరాబాద్‌లోని కీలక రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా పేరు

వ్రాసిన వారు Moogati Shabari
Jun 27, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అమెరికా కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి తెలంగాణ ప్రభుత్వం 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అనే పేరును అధికారికంగా ప్రకటించింది. పదవిలో కొనసాగుతున్న అమెరికా అధ్యక్షుడి పేరును భారతదేశంలోని ఒక ప్రధాన రహదారికి ఇవ్వడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ గౌరవంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆనందం వ్యక్తం చేస్తూ భారతదేశంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో హైదరాబాద్‌లో జరిగిన నామకరణ కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు.

వివరాలు

చరిత్రలో తొలిసారి..

తన పోస్టులో, హైదరాబాద్‌లో 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' పేరుతో రహదారి ప్రారంభం కావడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడికి ఈ తరహా గౌరవం దక్కడం చరిత్రలో ఇదే తొలిసారని వ్యాఖ్యానిస్తూ భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. నానక్‌రామ్‌గూడలో ఉన్న ఈ రహదారి ఇప్పటివరకు 'యూఎస్ కాన్సులేట్ రోడ్'గా ప్రసిద్ధి చెందింది. అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి ఆనుకుని ఉండే ఈ మార్గం హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో అత్యంత కీలకమైనది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రముఖ అమెరికన్ సాంకేతిక సంస్థల కార్యాలయాలు కూడా ఈ ప్రాంత పరిసరాల్లోనే ఉన్నాయి.

వివరాలు

అధికారికంగా ఆవిష్కరణ..

అమెరికా స్వాతంత్య్రానికి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన 'ఫ్రీడమ్ 250' వేడుకల్లో భాగంగా ఈ వారం ప్రారంభంలో 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' పేరుతో కొత్త నామఫలకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. ప్రపంచ సాంకేతిక కేంద్రంగా హైదరాబాద్ వేగంగా ఎదుగుతున్న ప్రతిష్ఠకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రతిపాదనను 2025 చివర్లో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ సమావేశంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక నామఫలక ఆవిష్కరణ కార్యక్రమానికి భారత పర్యటనలో ఉన్న అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Advertisement