నేపాల్ను ముంచెత్తున్న వరదలు, కొండచరియల విధ్వంసం; ఐదుగురు మృతి
తూర్పు నేపాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వరదల ధాటికి ఇప్పటివరకు 28మంది గల్లంతవడంతో పాటు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో నేపాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. నదుల్లో నీటిమట్టం పెరగడంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేపాల్లో వర్షాకాలం ప్రారంభంలో ఉంది. ఈ హిమాలయ దేశంలో రుతుపవనాలు ప్రతి సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ మధ్య ఉంటాయి.
ప్రతి సంవత్సరం నేపాల్లో వరదల భయాలు
చైన్పూర్ మునిసిపాలిటీ-4లో నిర్మాణంలో ఉన్న సూపర్ హేవా జలవిద్యుత్ ప్రాజెక్ట్లో ఒక వ్యక్తి చనిపోయాడని, మరో 21 మంది గల్లంతైనట్లు ఖాట్మండు పోస్ట్ వార్తాపత్రిక పేర్కొంది. పంచతర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో 9 ఏళ్ల బాలిక మరణించింది. చైన్పూర్లోని ఐదుగురు గ్రామస్థులు కూడా వరదల కారణంగా గల్లంతు అయినట్లు పోలీసులు తెలిపారు. ప్రతి సంవత్సరం నేపాల్లో వర్షాకాలంలో తీవ్రమైన వరదలు, కొండచరియలు విరిగిపడడం వల్ల మరణాలు సంభవించడంతో పాటు, వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ఈ వరదలు వ్యవసాయ భూములను నాశనం చేస్తాయి.