France: నిప్పుల గుండంగా మారిన యూరప్.. ఫ్రాన్స్,బ్రిటన్లో రెడ్ అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
యూరప్ ఖండాన్ని భీకర ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు ఎండల తీవ్రతతో అల్లాడుతున్నాయి. బయటకు వెళ్లకపోయినా వేడి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపశమనం కోసం ఈతకు వెళ్లిన వారిలో గత ఐదు రోజుల్లోనే 40 మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో తెలియజేస్తోంది. ఖండంలోని ఎక్కువ ప్రాంతాలు గతంలో ఎన్నడూ నమోదు కాని అసాధారణ ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నాయి. సగం దేశానికి గండం ఫ్రాన్స్ జాతీయ వాతావరణ సంస్థ'మెటియో ఫ్రాన్స్'దేశంలోని సగానికి పైగా ప్రాంతాలను అత్యంత ప్రమాదకరమైన 'రెడ్ హీట్వేవ్ అలర్ట్' పరిధిలోకి తీసుకొచ్చింది. పగలు,రాత్రి తేడా లేకుండా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
వివరాలు
మృతుల్లో యువతే ఎక్కువ
ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను సంక్షోభ పరిస్థితులపై నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మాట్లాడుతూ, గత గురువారం నుంచి నీట మునిగి మరణించిన 40 మందిలో ఎక్కువ మంది యువకులేనని వెల్లడించారు. ఫ్రాన్స్లో ఇళ్లతో పాటు ప్రజా రవాణా వ్యవస్థల్లో ఎయిర్ కండిషనింగ్ సదుపాయాలు పరిమితంగా ఉండటంతో వేడి ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. స్కూళ్ల కార్యకలాపాలు, రైళ్ల రాకపోకలు, క్రీడా కార్యక్రమాలు కూడా ఈ ఎండల కారణంగా ప్రభావితమయ్యాయి. మానవ తప్పిదాల వల్లే వాతావరణ మార్పులు తీవ్రరూపం దాల్చుతున్నాయని, రాబోయే ఐదేళ్లలో మరిన్ని వాతావరణ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది.
వివరాలు
బ్రిటన్ను వణికిస్తున్న వేడి గాలులు
ఇంగ్లిష్ చానల్ అవతల ఉన్న బ్రిటన్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడి వాతావరణ శాఖ బుధ, గురువారాల కోసం 'రెడ్ ఎక్స్ట్రీమ్ హీట్ వార్నింగ్' జారీ చేసింది. జూన్ నెల చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దక్షిణ ఇంగ్లాండ్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్కు, ఆగ్నేయ వేల్స్లో 35 డిగ్రీల వరకు చేరుకునే అవకాశముంది. బుధ, గురువారాల్లో వేడి మరింత పెరిగి 39 డిగ్రీల మార్కును దాటవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే శుక్రవారం నుంచి ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వివరాలు
బద్దలవుతున్న ఉష్ణోగ్రతల రికార్డులు
దేశవ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడని మెటియో ఫ్రాన్స్ పేర్కొంది. ఎండల కారణంగా ప్రజలు తీవ్ర అలసటకు గురవుతున్నారని, పరిస్థితి రోజురోజుకీ మరింత కఠినంగా మారుతోందని తెలిపింది. ఈ వారాంతం వరకు ఫ్రాన్స్లోని అనేక నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎన్నడూ నమోదు కాని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదై ఆల్టైమ్ రికార్డులను తిరగరాసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
2003 ఘోర ఉష్ణోగ్రతలను గుర్తు చేస్తున్న పరిస్థితులు
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు 2003 ఆగస్టులో యూరప్ను కుదిపేసిన ఘోర ఉష్ణ తరంగాలను గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో ఎయిర్ కండిషనింగ్ సదుపాయాలు లేని వృద్ధాశ్రమాలు, అపార్ట్మెంట్లలో నివసిస్తున్న సుమారు 15 వేల మంది వృద్ధులు ఎండల ధాటికి ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనల అనంతరం ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రత్యేకంగా 'హీట్ వాచ్ వార్నింగ్ సిస్టమ్'ను అమల్లోకి తీసుకొచ్చింది. యూరోపియన్ యూనియన్కు చెందిన Copernicus Climate Change Service వివరాల ప్రకారం, 1980ల నుంచి ప్రపంచ సగటుతో పోలిస్తే యూరప్ ఖండం దాదాపు రెట్టింపు వేగంతో వేడెక్కుతోంది.