NITISH KAUSHAL: అమెరికాలో అరెస్టైన భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ . ఎవరీ ఈ నితీశ్ కౌశల్.?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ నేర ముఠాపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) కీలక చర్య చేపట్టింది. పంజాబ్కు చెందిన గ్యాంగ్స్టర్ జగ్గూ భగవాన్పురియా నిర్వహిస్తున్న అంతర్జాతీయ నేర ముఠాలో కీలక సభ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నితీశ్ కౌశల్ను అమెరికాలోని వర్మాంట్ రాష్ట్రంలో అరెస్ట్ చేసినట్లు ఎఫ్బీఐ ప్రకటించింది. ఇటీవలే అతడిని తమ 'మోస్ట్ వాంటెడ్' జాబితాలో చేర్చిన ఎఫ్బీఐ, అరెస్ట్ అనంతరం ఈ విషయాన్ని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. అలాగే ఈ ముఠాకు చెందిన పరారీలో ఉన్న ఇతర నిందితుల ఆచూకీపై సమాచారం అందించాలని ప్రజలను కోరింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎఫ్బీఐ చేసిన ట్వీట్
Thanks to the outstanding work our @USBPChiefSWB partners are doing to ensure the safety and security of our Northern Border, this dangerous fugitive from @FBILosAngeles was captured early this morning in Vermont. #FBIAlbany is thankful for their partnership and remains committed… pic.twitter.com/d1i6eh9Jaq
— FBI Albany (@FBIAlbany) July 16, 2026
వివరాలు
జగ్గూ భగవాన్పురియా ముఠా అంటే ఏమిటి?
జగ్గూ భగవాన్పురియా ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్ పంజాబ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ నేర ముఠాగా దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి.
అమెరికా,కెనడా,బ్రిటన్,యూరప్లోని పలు దేశాలు,ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ వరకు ఈ ముఠా నెట్వర్క్ విస్తరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ ముఠాకు వెయ్యికి పైగా సభ్యులు,అనుచరులు ఉన్నారని, అమెరికాలోనే వంద మందికి పైగా కార్యకర్తలు ఉన్నట్లు ప్రాసిక్యూషన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఈ ముఠా హత్యలు, కిడ్నాప్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, బలవంతపు వసూళ్లు, అక్రమ ఆయుధాల సరఫరా, మనీ లాండరింగ్, మానవ అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాల ద్వారా ఆదాయం సంపాదిస్తున్నట్లు అభియోగాలు ఉన్నాయి.
వివరాలు
నితీశ్ కౌశల్ పాత్ర ఏమిటి?
ఈ కేసులో కాలిఫోర్నియా జిల్లా కోర్టు జూన్ 25న నితీశ్ కౌశల్పై ఫెడరల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
అతడిపై అమెరికాలోని కఠినమైన రికో (RICO-Racketeer Influenced and Corrupt Organizations) చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ ముఠాలో 'లాలా' అనే మారుపేరుతో గుర్తింపు పొందిన నితీశ్ కౌశల్ కీలక పాత్ర పోషించినట్లు ఎఫ్బీఐ అభియోగపత్రంలో పేర్కొంది.
కిడ్నాప్లు, దాడులు, ఇతర హింసాత్మక చర్యల్లో అతడు చురుకుగా పాల్గొన్నట్లు ఆరోపించింది.
ప్రత్యేకంగా 2024 జూలై 10న జరిగిన కిడ్నాప్ ఘటనలో నితీశ్ ప్రధాన పాత్రధారి అని ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు.
ముఠాకు చెందిన డ్రగ్స్ సరుకును ఒక వ్యక్తి దొంగిలించాడనే అనుమానంతో అతడిని కాలిఫోర్నియాలోని మాంటెకాలో ఉన్న ఒక ఇంటికి పిలిపించారు.
వివరాలు
నితీశ్ కౌశల్ పాత్ర ఏమిటి?
అక్కడ నితీశ్తో పాటు మరో ముగ్గురు కలిసి బాధితుడిని బంధించి తీవ్రంగా కొట్టిన తర్వాత ఫ్రెస్నోలోని ఓ అపార్ట్మెంట్కు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దొంగిలించబడిన డ్రగ్స్కు పరిహారంగా బాధితుడి నుంచి 50 వేల డాలర్లు డిమాండ్ చేసినట్లు అభియోగపత్రంలో పేర్కొన్నారు.
అనంతరం ముఠాలోని అంతర్గత వివాదాలను పరిష్కరించే క్రమంలో జగ్గూ భగవాన్పురియా ఆదేశాల మేరకు బాధితుడిని విడుదల చేసినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు.
వివరాలు
ముఠా కార్యకలాపాలు ఎలా సాగేవి?
ఈ నేర ముఠా ప్రధానంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపైనే ఆధారపడి పనిచేసినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.
దక్షిణ కాలిఫోర్నియాలో కొకైన్, మెథామ్ఫెటమైన్ వంటి డ్రగ్స్ను సేకరించి, భారీ సెమీ-ట్రక్కుల ద్వారా అమెరికా తూర్పు తీరం,కెనడా సరిహద్దు ప్రాంతాలకు తరలించేవారని ఆరోపిస్తున్నారు.
ఒక్కో రవాణాలో సుమారు 100కిలోల వరకు డ్రగ్స్ ఉండేవని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.
డ్రగ్స్ రవాణాతో పాటు సుపారీ హత్యలు, ప్రత్యర్థి ముఠాల నుంచి మాదకద్రవ్యాల దోపిడీ,బలవంతపు వసూళ్లు కూడా ఈ ముఠా కార్యకలాపాల్లో భాగంగా ఉన్నాయని అభియోగాలు ఉన్నాయి.
అంతేకాకుండా, బాధితుల కుటుంబ సభ్యుల వివరాలను, ముఖ్యంగా భారత్లో నివసించే వారి సమాచారాన్ని సేకరించి, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల ద్వారా బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.
వివరాలు
ముఠా కార్యకలాపాలు ఎలా సాగేవి?
పంజాబ్లోని కొందరు అవినీతి పోలీసు అధికారులతో కుమ్మక్కై ప్రత్యర్థులపై తప్పుడు కేసులు నమోదు చేయించి, వాటిని ఉపసంహరించుకునేందుకు డబ్బు డిమాండ్ చేసినట్లు కూడా అభియోగపత్రంలో పేర్కొన్నారు.
అలాగే డబ్బు, అధికారం, విదేశాలకు వెళ్లే అవకాశాలు చూపించి పంజాబ్ యువతను ముఠాలో చేర్చుకునేవారని ఆరోపిస్తున్నారు.
దర్యాప్తులో కీలక ముందడుగు
నితీశ్ కౌశల్ అరెస్ట్తో ఈ అంతర్జాతీయ నేర ముఠాపై జరుగుతున్న దర్యాప్తులో కీలక పురోగతి నమోదైనట్లు అధికారులు భావిస్తున్నారు.
అయితే, నితీశ్ కౌశల్తో పాటు ఇతర నిందితులపై నమోదైన ఆరోపణలు ప్రస్తుతం న్యాయస్థాన పరిశీలనలో ఉన్నాయి.
కోర్టులో అవి రుజువయ్యే వరకు చట్టపరంగా వారిని నిర్దోషులుగానే పరిగణించాల్సి ఉంటుంది.