Balochistan: పాకిస్థాన్లో హిందూ వ్యాపారిపై కాల్పులు.. దుకాణంలోనే దారుణ హత్య!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్లోని బలోచిస్థాన్లో ఓ హిందూ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. నోష్కి పట్టణంలో గుర్తుతెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో ఆయన మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతుడిని రాకేశ్ కుమార్గా గుర్తించారు. నోష్కి పట్టణంలో రాకేశ్ కుమార్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది గుర్తుతెలియని సాయుధులు ఆయన దుకాణంలోకి చొరబడ్డారు. వారిని రాకేశ్ కుమార్ ప్రతిఘటించడంతో సాయుధులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యను ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు గురుపాల్ సింగ్ తీవ్రంగా ఖండించారు.
వివరాలు
నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్
దేశ, బలోచిస్థాన్ వ్యతిరేక శక్తులు చేసిన పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.
అమాయక హిందూ వ్యాపారులు, పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ప్రజల్లో ద్వేషం, భయాన్ని సృష్టించలేరని గురుపాల్ సింగ్ అన్నారు.
రాకేశ్ కుమార్ హత్యకు పాల్పడిన వారితో పాటు వారికి సహకరించిన వ్యక్తులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.