Abbas Araghchi:దాడి సమయంలో ఖమేనీ కార్యాలయంలోనే ఉన్నా.. : అబ్బాస్ అరాగ్చీ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇజ్రాయెల్లు ఫిబ్రవరి 28న ఇరాన్పై నిర్వహించిన దాడిలో అప్పటి సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ దాడి సమయంలో తాను ఖమేనీ కార్యాలయంలోనే ఉన్నానని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించారు. లెబనాన్కు చెందిన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వివరించారు. దాడి అనంతరం ఖమేనీ పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైనట్లు చెప్పారు.
వివరాలు
శిథిలాల మధ్య నుంచి బయటపడ్డా..
జెనీవాలో జరిగిన కీలక దౌత్య చర్చలను ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత, మరుసటి ఉదయం ఖమేనీకి నివేదిక అందించేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లినట్లు అరాగ్చీ తెలిపారు. తాను భవనంలో ఉన్న సమయంలోనే దాడి జరిగిందని, వారు సమావేశమైన విభాగం కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. శిథిలాల మధ్య నుంచి బయటకు వచ్చిన క్షణంలో తన ఆలోచనలన్నీ ఖమేనీ గురించే ఉన్నాయని పేర్కొన్నారు. తన భద్రత గురించి కాకుండా సుప్రీం లీడర్ క్షేమం గురించే ఆందోళన చెందానన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రాకపోవడంతో రెండు రోజుల పాటు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు వెల్లడించారు.
వివరాలు
ప్రజలతోనే ఉంటానన్న ఖమేనీ
అమెరికా, ఇజ్రాయెల్ల నుంచి ముప్పు ఉందన్న నేపథ్యంలో ముందుగానే ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించినట్లు అరాగ్చీ తెలిపారు. అయితే ఆ ప్రతిపాదనను ఖమేనీ తిరస్కరించారని చెప్పారు. ఇరాన్ ప్రజలకు పూర్తి రక్షణ కల్పించే వరకు తాను ఎక్కడికీ వెళ్లబోనని ఖమేనీ స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు ఏ ప్రమాదం ఎదురైతే, అదే పరిస్థితిని తానూ ఎదుర్కొంటానని ఆయన చెప్పినట్లు అరాగ్చీ గుర్తు చేశారు.
వివరాలు
ముందుగానే హెచ్చరించాం
ఇరాన్పై దాడులకు అమెరికా సైనిక స్థావరాలను వినియోగిస్తే ప్రతీకార చర్యలు తప్పవని గల్ఫ్ దేశాలను ముందుగానే హెచ్చరించినట్లు అరాగ్చీ తెలిపారు. పొరుగు దేశాల్లో అమెరికా స్థావరాలు లేకపోయి ఉంటే, ఆ దేశాలపై ఎలాంటి ప్రతీకార దాడులు జరిగేవి కావని పేర్కొన్నారు. తమ భూభాగాన్ని అమెరికా సైనిక కార్యకలాపాలకు వినియోగించడాన్ని ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యతిరేకించినప్పటికీ, అమెరికా ఆ అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకు సాగిందని ఆయన ఆరోపించారు.