Loading...
Iran Captures US Submarine: హర్ముజ్‌లో అమెరికా మానవరహిత జలాంతర్గామి పట్టివేత.. ఇరాన్‌ సంచలన ప్రకటన
హర్ముజ్‌లో అమెరికా మానవరహిత జలాంతర్గామి పట్టివేత.. ఇరాన్‌ సంచలన ప్రకటన

Iran Captures US Submarine: హర్ముజ్‌లో అమెరికా మానవరహిత జలాంతర్గామి పట్టివేత.. ఇరాన్‌ సంచలన ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2026
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. హర్ముజ్‌ జలసంధి ప్రవేశద్వారం సమీపంలో అమెరికాకు చెందిన అత్యాధునిక మానవరహిత జలాంతర్గామిని స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. మరోవైపు అమెరికా దళాలు ఐదు ఇరానియన్‌ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించాయి. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం మరింత ముదిరింది.

వివరాలు 

అమెరికా మానవరహిత జలాంతర్గామి స్వాధీనం

ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జీసీ) అధికారిక మీడియా 'సెపాహ్‌ న్యూస్‌' కథనం ప్రకారం.. సంక్లిష్టమైన నిఘా ఆపరేషన్‌ నిర్వహించి అమెరికాకు చెందిన డైవ్‌ ఎల్‌డీ (Dive-LD) మానవరహిత అండర్‌వాటర్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ప్రపంచంలో అత్యాధునిక అండర్‌వాటర్‌ సాంకేతికత కలిగిన వాహనాల్లో ఇది ఒకటని ఇరాన్‌ పేర్కొంది.

ఈ చర్యకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. ఇదే సమయంలో హర్ముజ్‌ జలసంధి ప్రాంతంలో అమెరికాకు చెందిన ఎమ్‌క్యూ-9 రీపర్‌ (MQ-9 Reaper) డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది.

వివరాలు 

అమెరికా ఏమంటోంది?

ఇరాన్‌ చేసిన ప్రకటనపై అమెరికా స్పందించింది. తమకు చెందిన ఓ మానవరహిత అండర్‌వాటర్‌ వాహనం అంతకుముందు రోజు పనిచేయకుండా నిలిచిపోయినట్లు అమెరికా సైన్యం తెలిపింది.

అయితే ఇరాన్‌ స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్న వాహనం అదేనా? అనే విషయాన్ని మాత్రం అమెరికా ధ్రువీకరించలేదు.

పెంటగాన్‌ ప్రకారం.. ఆ వాహనం పాత మోడల్‌కు చెందినది. అందులో అత్యంత సున్నితమైన సమాచారం లేదని, రహస్య సోనార్‌ లేదా రాడార్‌ పరికరాలు కూడా లేవని వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు 

ఐదు ఇరాన్‌ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసిన అమెరికా

మరోవైపు ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి.

అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (CENTCOM) వెల్లడించిన వివరాల ప్రకారం.. తమ యుద్ధనౌకపై ఇరాన్‌ క్షిపణులతో దాడి చేయడంతో ప్రతిస్పందనగా ఐదు ఇరానియన్‌ ముడిచమురు ట్యాంకర్లను ధ్వంసం చేశారు.

గత రెండు రోజుల్లో అమెరికా నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులతో రెండుసార్లు దాడికి ప్రయత్నించిందని సెంట్‌కామ్‌ పేర్కొంది.

ఈ దాడులకు ప్రతీకారంగానే ట్యాంకర్లపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

ఇరాన్‌ విమానయాన సంస్థలపై కొత్త ఆంక్షలు

ఇదిలా ఉండగా.. ఇరాన్‌పై అమెరికా మరో కీలక చర్య తీసుకుంది.

ఆ దేశానికి చెందిన 27 విమానయాన సంస్థలను ప్రత్యేక ఆంక్షల జాబితాలో చేర్చినట్లు అమెరికా ఆర్థిక శాఖ వెల్లడించింది.

ఇరాన్‌ ప్రభుత్వం, ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జీసీ)కు ఆయుధాల రవాణా, సిబ్బంది తరలింపులో వాణిజ్య విమానయాన సంస్థలు సహకరిస్తున్నాయని అమెరికా ఆరోపించింది.

ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలపై ఆంక్షలు విధించినట్లు పేర్కొంది.

వివరాలు 

'పశ్చాత్తాపపడే వరకు పోరాటం'

యుద్ధం విషయంలో ఇరాన్‌ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆ దేశ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ స్పష్టం చేశారు.

ఇరాన్‌ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదని ఆయన తెలిపారు. అయితే తమపై దాడులు జరిగితే వాటిని ఎదుర్కొనేందుకు ప్రతిఘటన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఆక్రమణదారులు పూర్తిగా పశ్చాత్తాపపడే వరకు బలంగా పోరాడుతామని పెజెష్కియాన్‌ పేర్కొన్నారు. దీంతో ఇరాన్‌ తన వైఖరిని మార్చుకునే పరిస్థితి లేదనే సంకేతాలు వెలువడ్డాయి.

వివరాలు 

మళ్లీ భగ్గుమన్న అమెరికా-ఇరాన్‌ ఘర్షణలు

ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్త దాడులతో ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధానికి ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది.

ఆ తర్వాత హర్ముజ్‌ జలసంధిపై తన నియంత్రణను మరింత బలోపేతం చేసుకుంది.

యుద్ధానికి ముగింపు పలికేందుకు జూన్‌ 18న అమెరికా, ఇరాన్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ.. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు పరిస్థితిని మళ్లీ మార్చేశాయి.

అమెరికా మానవరహిత వాహనం స్వాధీనం, డ్రోన్‌ కూల్చివేత, ఐదు చమురు ట్యాంకర్ల ధ్వంసం, ఇరాన్‌ విమానయాన సంస్థలపై ఆంక్షలు వంటి వరుస చర్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి.

ADVERTISEMENT