LOADING...
Iran Warns Protests: ఇరాన్‌లో ఉక్కుపాదం.. నిరసనకారుల్ని 'మొహారెబ్‌'గా ప్రకటించిన ప్రభుత్వం
ఇరాన్‌లో ఉక్కుపాదం.. నిరసనకారుల్ని 'మొహారెబ్‌'గా ప్రకటించిన ప్రభుత్వం

Iran Warns Protests: ఇరాన్‌లో ఉక్కుపాదం.. నిరసనకారుల్ని 'మొహారెబ్‌'గా ప్రకటించిన ప్రభుత్వం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2026
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో రెండు వారాలుగా కొనసాగుతున్న భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అత్యంత కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఈ పరిణామాలపై ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవాహెది అజాద్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. నిరసనల్లో పాల్గొనే వారిని 'దేవుని శత్రువులు (మొహారెబ్)'గా పరిగణిస్తామని, అలాంటి నేరానికి మరణశిక్ష వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం నిరసనకారులే కాకుండా, అల్లరిమూకలకు సహకరించిన వారిని కూడా ఇదే నేరానికి బాధ్యులుగా చూస్తామని తెలిపారు. ఇరాన్ చట్టంలోని ఆర్టికల్‌ 186 ప్రకారం, ఇస్లామిక్ రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా ఆయుధాలతో పోరాడే ఏ సంస్థకైనా మద్దతు ఇచ్చిన వ్యక్తిని 'మొహారెబ్‌'గా పరిగణిస్తారని అటార్నీ జనరల్ వివరించారు.

Details

దేశ బహిష్కరణ వంటి శిక్షలు

అలాగే ఇరాన్ శిక్షా నియమావళిలోని ఆర్టికల్‌ 190 ప్రకారం ఈ నేరానికి అత్యంత కఠిన శిక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. మరణశిక్ష, ఉరి, కుడి చేయి-ఎడమ కాలి తొలగింపు, శాశ్వత అంతర్గత నిర్బంధం (దేశంలోనే బహిష్కరణ) వంటి శిక్షలు విధించే అవకాశం ఉందని చట్టం స్పష్టంగా చెబుతోందన్నారు. అమెరికా నుంచి వచ్చిన హెచ్చరికలను లెక్కచేయకుండా టెహ్రాన్ ప్రభుత్వం ఈ కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రాసిక్యూటర్లకు జారీ చేసిన ఆదేశాల్లో దేశంలో అస్థిరత సృష్టించి, విదేశీ ఆధిపత్యానికి మార్గం వేయాలని ప్రయత్నించే వారిపై విచారణ ఆలస్యం చేయకుండా, ఎలాంటి సడలింపులు లేకుండా దర్యాప్తు జరపాలని సూచించారు.

Details

2,300 మందికిపైగా అరెస్టు

ఇక, అమెరికా కేంద్రంగా పని చేస్తున్న మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు ఈ నిరసనల్లో సుమారు 65 మంది మృతి చెందగా, 2,300 మందికిపైగా అరెస్టయ్యారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో టెహ్రాన్‌లో ఇంటర్నెట్ సేవలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను కూడా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన ప్రవాస యువరాజు రెజా పహ్లవి ప్రజలను మరోసారి రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. జనవరి 10, 11 తేదీల్లో నిరసనల్లో పాల్గొని, షా పాలన కాలంలో ఉపయోగించిన సింహం-సూర్యుడు జెండాతో పాటు జాతీయ చిహ్నాలను ప్రదర్శిస్తూ ప్రజా స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Details

దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం

వాస్తవానికి, ఈ నిరసనలు మొదట ఇస్లామిక్ రిపబ్లిక్‌పై ఉన్న అసంతృప్తితో ప్రారంభమయ్యాయి. 2025 డిసెంబర్ చివర్లో ఇరాన్ కరెన్సీ 'రియల్' విలువ ఒక్క అమెరికన్ డాలర్‌కు 14 లక్షల స్థాయికి పడిపోవడం ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ పరిస్థితి క్రమంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారింది. మొత్తంగా చూస్తే, ఇరాన్‌లో పరిస్థితి రోజు రోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతుండగా, ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.

Advertisement