జెనిన్లో ఇజ్రాయెల్ ఆపరేషన్; 12మంది మృతి
జెనిన్ శరణార్థి శిబిరంలోని తీవ్రవాద మౌలిక సదుపాయాలు, ఆయుధాలను నాశనం చేయడం లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ ముగిసింది. ఈ దాడిలో 12మంది పాలస్తీనియన్లు చనిపోయారు. అందులో ఐదుగురు మిలిటెంట్లు ఉండంగా, ఒక ఇజ్రాయెల్ సైనికుడు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం సోమవారం ఉదయం ఆపరేషన్ చేపట్టింది. అలాగే మంగళవారానికి ఆపరేషన్ను ముగించింది. తొలుత ఇజ్రాయెల్ డ్రోన్తో దాడి చేసింది. ఆపరేషన్ కోసం 1,000 మంది సైనికులను మోహరించారు. గత 20ఏళ్లలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ చేపట్టిన అతిపెద్ద సైనిక కార్యకలాపాల్లో ఇది ఒకటి.
ఇజ్రాయెల్ వైపు ఐదు రాకెట్లను ప్రయోగించిన పాలస్తీనా మిలిటెంట్లు
ఇజ్రాయెల్ బలగాలు వెనుతిరిగిన తర్వాత, గాజా స్ట్రిప్లోని పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెల్ వైపు ఐదు రాకెట్లను ప్రయోగించినట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. అయితే దీని వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ వ్యాపార కేంద్రమైన టెల్ అవీవ్లో పాలస్తీనా హమాస్ మిలిటెంట్ గ్రూప్ రెచ్చిపోయింది. కత్తులతో దాడి చేయడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. పాలస్తీనా తీరప్రాంతం నుంచి రాకెట్లు ప్రయోగించినందుకు ప్రతిస్పందనగా గాజా స్ట్రిప్పై వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది.