LOADING...
Israel and Lebanon: ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణకు అంగీకారం.. అమెరికా మధ్యవర్తిత్వంతో కీలక ఒప్పందం
అమెరికా మధ్యవర్తిత్వంతో కీలక ఒప్పందం

Israel and Lebanon: ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణకు అంగీకారం.. అమెరికా మధ్యవర్తిత్వంతో కీలక ఒప్పందం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2026
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా మధ్యవర్తిత్వంలో వాషింగ్టన్‌లో దాదాపు తొమ్మిది గంటలపాటు సాగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ మేరకు ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అయితే ఈ ఒప్పందం విజయవంతం కావడం హిజ్‌బొల్లా సాయుధ దళాల వైఖరిపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాయి. ఒప్పందం ప్రకారం లెబనాన్ దక్షిణ ప్రాంతంలోని సౌత్ లిటానీ సెక్టార్ నుంచి హిజ్‌బొల్లా బలగాలు పూర్తిగా వైదొలగాలి. అలాగే ఇజ్రాయెల్‌పై నిర్వహిస్తున్న అన్ని రకాల దాడులను నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అమలైతేనే కాల్పుల విరమణ కొనసాగుతుందని ఇరు దేశాలు పేర్కొన్నాయి.

వివరాలు 

లెబనాన్ అధికారిక సైన్యమే పూర్తి నియంత్రణ

సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా మండలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ జోన్లలో ఇతర సాయుధ సంస్థలకు ఎలాంటి అవకాశం లేకుండా కేవలం లెబనాన్ అధికారిక సైన్యమే పూర్తి నియంత్రణ చేపడుతుంది. దేశవ్యాప్తంగా తన అధికారాన్ని సమర్థంగా అమలు చేసేలా లెబనాన్ సైన్యానికి అమెరికా సైనిక, వ్యూహాత్మక సహాయాన్ని అందించనుంది. లెబనాన్‌లో హిజ్‌బొల్లాకు చెందిన మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం, ఆ సంస్థను నిరాయుధీకరించడం ద్వారానే తమ దేశ భద్రతకు హామీ లభిస్తుందని ఇజ్రాయెల్ మరోసారి స్పష్టం చేసింది. మరోవైపు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తమ సరిహద్దులను గౌరవించడంతో పాటు దేశ భౌగోళిక సమగ్రత, ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించాలని లెబనాన్ కోరింది.

వివరాలు 

ఇరాన్ చర్యలను ఖండించిన అన్ని పక్షాలు

చర్చల సందర్భంగా అమెరికా, ఇజ్రాయెల్, లెబనాన్ ప్రతినిధులు ఇరాన్ ప్రాంతీయ విధానాలపై విమర్శలు గుప్పించారు. హిజ్‌బొల్లా వంటి ప్రాక్సీ గ్రూపులకు మద్దతు ఇస్తూ పశ్చిమాసియాలో స్థిరత్వానికి భంగం కలిగిస్తున్న ఇరాన్ చర్యలను అన్ని పక్షాలు ఖండించాయి. ప్రస్తుతం కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై మరింత చర్చించేందుకు జూన్ 22 నుంచి మరో దఫా రాజకీయ, భద్రతాపరమైన ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి వరకు ఇరు దేశాల మధ్య అమెరికా సమన్వయకర్తగా వ్యవహరించనుంది.

Advertisement