Lahore: తీవ్రవాదుల ఒత్తిడితో.. హిందూ,సిక్కు పేర్ల పునరుద్ధరణపై వెనక్కి తగ్గిన పాక్ ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్లోని లాహోర్ నగరంలో విభజనకు ముందు ఉన్న హిందూ, సిక్కు కాలం నాటి రోడ్లు, ప్రాంతాల పేర్లను తిరిగి తీసుకురావాలన్న ప్రతిపాదనను పంజాబ్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. తీవ్రవాద వర్గాలు, సోషల్ మీడియా వ్లాగర్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లాహోర్ హెరిటేజ్ ఏరియాస్ రివైవల్ (LAHR) కమిటీ ఈ ప్రతిపాదనకు ముందుగా ఆమోదం తెలిపింది. నగర చారిత్రక గుర్తింపును తిరిగి తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలో భాగంగా క్వీన్స్ రోడ్ను మళ్లీ అదే పేరుతో, ప్రస్తుతం ఉన్న ఫాతిమా జిన్నా రోడ్కు బదులుగా పునరుద్ధరించాలని సూచించారు.
వివరాలు
వివాదాల నేపథ్యంలో నిర్ణయం వాయిదా
అలాగే జైల్ రోడ్ను ఆలామా ఇక్బాల్ రోడ్ స్థానంలో, కృష్ణ నగర్ను ఇస్లాంపురా స్థానంలో పాత పేర్లతో మార్చాలని ప్రతిపాదించారు. మరోవైపు లక్ష్మీ చౌక్, ధర్మపురా, టెంపుల్ స్ట్రీట్, జైన్ మందిర్ రోడ్ వంటి పాత పేర్లను కూడా తిరిగి తీసుకురావాలని సూచనలు వచ్చాయి. నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో ఈ హెరిటేజ్ ప్రాజెక్ట్ కొనసాగుతోంది. అయితే ఈ నిర్ణయంపై మతపరమైన సంస్థలు, సోషల్ మీడియా వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. హిందూ,సిక్కు పేర్లను మళ్లీ తీసుకురావడం సరైంది కాదంటూ విమర్శలు గుప్పించాయి. దీనిపై స్పందించిన లాహోర్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ అలీ ఇజాజ్.. ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
వివరాలు
చారిత్రక ప్రాధాన్యంపై నిపుణులతో చర్చలు
వివాదం మరింత పెరగకుండా ఉండేందుకు మరియం నవాజ్ ప్రభుత్వం ఈ అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. ఈ వివాదం తర్వాత LAHR కమిటీ చరిత్రకారులు, ఆర్కిటెక్టులు, పట్టణ ప్రణాళిక నిపుణులు, విద్యావేత్తలతో సమావేశమైంది. లాహోర్ పాత పేర్ల పునరుద్ధరణకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యంపై చర్చలు నిర్వహించారు. లాహోర్ చారిత్రక గుర్తింపు భవిష్యత్ తరాలకు అందించాల్సిన అమూల్యమైన వారసత్వమని సమావేశంలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారని అధికారిక ప్రకటన వెల్లడించింది.