Loading...
Meta: మెటాకు అమెరికా కోర్టు భారీ షాక్.. 567 మిలియన్ డాలర్లు చెల్లించాలని సంచలన ఆదేశం
మెటాకు అమెరికా కోర్టు భారీ షాక్.. 567 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశం

Meta: మెటాకు అమెరికా కోర్టు భారీ షాక్.. 567 మిలియన్ డాలర్లు చెల్లించాలని సంచలన ఆదేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2026
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫేస్‌ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. యువత, చిన్నారులపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ప్రభావానికి సంబంధించి దాఖలైన కేసులో మొత్తం 567 మిలియన్ డాలర్లు చెల్లించాలని న్యూ మెక్సికో కోర్టు ఆదేశించింది. పిల్లల మానసిక ఆరోగ్యం, చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కు సంబంధించిన ఆరోపణలపై జరిగిన విచారణ అనంతరం ఈ తీర్పు వెలువడింది. $420 మిలియన్లు యువత చికిత్సకు గురువారం వెలువడిన తీర్పులో జడ్జి బ్రయాన్ బీడ్షీడ్, మొత్తం 567 మిలియన్ డాలర్లలో 420 మిలియన్ డాలర్లను యువతకు మానసిక ఆరోగ్య చికిత్సా సేవల కోసం కేటాయించాలని ఆదేశించారు. మిగిలిన నిధులను వచ్చే ఐదేళ్లలో అవగాహన కార్యక్రమాలు, నివారణ చర్యలు, స్క్రీనింగ్ సేవలు, ఇతర సంబంధిత అవసరాలకు వినియోగించనున్నారు.

వివరాలు 

గతంలోనే $375 మిలియన్ల సివిల్ పెనాల్టీ

ఈ కేసు తొలి దశ విచారణ మార్చిలో జరిగింది. అప్పట్లో జ్యూరీ మెటాపై 375 మిలియన్ డాలర్ల సివిల్ పెనాల్టీ విధించింది.

పిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా తమ ప్లాట్‌ఫారమ్‌లు పనిచేస్తున్నాయని తెలిసినా కంపెనీ తగిన చర్యలు తీసుకోలేదని జ్యూరీ అభిప్రాయపడింది.

అలాగే ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లల లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టినట్లు కూడా పేర్కొంది.

Metaలో మరిన్ని మార్పులు చేయాలని డిమాండ్

రెండో దశ విచారణలో ప్రాసిక్యూటర్లు మెటా విధానాల్లో మరిన్ని సంస్కరణలు చేపట్టాలని కోరారు.

ముఖ్యంగా వినియోగదారులను ఎక్కువసేపు ప్లాట్‌ఫారమ్‌లో ఉంచే వ్యసనపూరిత ఫీచర్లను నియంత్రించడం,వయస్సు ధృవీకరణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం,చిన్నారుల ఖాతాలకు డిఫాల్ట్ ప్రైవసీ రక్షణలను పెంచడం వంటి చర్యలను అమలు చేయాలని సూచించారు.

వివరాలు 

COPPA చట్టం ఏమి చెబుతోంది?

అయితే, 13 ఏళ్లలోపు పిల్లలకు సంబంధించి కొన్ని వయస్సు ధృవీకరణ విధానాలను అమలు చేయడంపై ఫెడరల్ చైల్డ్ ప్రైవసీ చట్టాలు పరిమితులు విధిస్తున్నాయని కోర్టు స్పష్టం చేసింది.

Children's Online Privacy Protection Act (COPPA) ప్రకారం 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని తప్పనిసరిగా సేకరించడం లేదా వారి వయస్సు నిర్ధారణ కోసం ఆన్‌లైన్‌లో నిష్క్రియాత్మకంగా ట్రాక్ చేయడం వంటి చర్యలకు పరిమితులు ఉన్నాయి.

అలాగే వయస్సు ధృవీకరణ నిబంధనలను కేవలం మెటాకు మాత్రమే వర్తింపజేసి, ఇతర సోషల్ మీడియా సంస్థలకు మినహాయింపు ఇవ్వడం సమానత్వానికి విరుద్ధమవుతుందని, దీంతో కంపెనీకి అధిక నష్టం కలిగే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

ADVERTISEMENT

వివరాలు 

భారత్‌లోనూ మెటాపై ప్రభుత్వ ప్రశ్నలు

అమెరికా కోర్టు తీర్పు వెలువడిన సమయంలోనే భారత్‌లో కూడా మెటాపై ప్రభుత్వ స్థాయిలో విచారణలు కొనసాగుతున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ రికమండేషన్ అల్గారిథమ్‌లు, భారత చట్టాల అమలు, హానికరమైన ఆన్‌లైన్ కంటెంట్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వ అధికారులు వరుసగా రెండో రోజు మెటా ప్రతినిధులతో సమావేశమయ్యారు.

సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో కంపెనీ ప్రతినిధులు కొన్ని "తీవ్రమైన సమస్యలు" ఉన్నాయని అంగీకరించడంతో పాటు, వాటి పరిష్కారానికి నిరంతర చర్యలు తీసుకుంటామని ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ADVERTISEMENT

వివరాలు 

అశ్విని వైష్ణవ్‌తో మెటా ప్రతినిధుల భేటీ

మెటా గ్లోబల్ అఫైర్స్ హెడ్ జోయెల్ కప్లాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వరుసగా రెండో రోజు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్'ను కలిసింది.

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌ను తాత్కాలికంగా పరిమితం చేసిన ఘటన అనంతరం వివరణ కోరుతూ ప్రభుత్వం మెటా అధికారులను పిలిచింది.

గురువారం జరిగిన చర్చల్లో భారత చట్టాల అమలు, అల్గారిథమ్‌ల పని విధానం, రాజ్యాంగపరమైన మరియు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా కంపెనీ తీసుకుంటున్న భద్రతా చర్యలపై అధికారులు పలు ప్రశ్నలు సంధించారు.

వివరాలు 

CSAM, డీప్‌ఫేక్స్‌పై మెటా వివరణ

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, డీప్‌ఫేక్స్, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (CSAM), బాట్ అకౌంట్లు, ఇతర సింథటిక్ కంటెంట్ వంటి సమస్యలను అరికట్టేందుకు మెటా పలు చర్యలు చేపడుతోందని కంపెనీ వివరించింది.

అలాగే తమ ప్లాట్‌ఫారమ్‌ల సాంకేతిక అంశాలు, అల్గారిథమ్‌ల నిష్పాక్షికతను మెరుగుపరిచేందుకు అనుసరిస్తున్న విధానాలు, ఉపయోగిస్తున్న పారామీటర్లపై కూడా కంపెనీ అధికారులు ప్రభుత్వానికి వివరించినట్లు తెలిసింది.

వివరాలు 

మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు చర్చలు

మెటా, భారత ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగనున్నట్లు సమాచారం.

తదుపరి సమావేశాల్లో ప్రధానంగా సాంకేతిక అంశాలపై దృష్టి సారించనున్నారు.

మెటా టెక్నికల్ ఎగ్జిక్యూటివ్‌లు కేంద్ర ప్రభుత్వ సాంకేతిక అధికారులతో సమావేశం కానుండగా, ఈ చర్చలకు ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ నాయకత్వం వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అమెరికాలో పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన కేసులో భారీ ఆర్థిక బాధ్యతను ఎదుర్కొంటున్న మెటా, భారత్‌లోనూ అల్గారిథమ్‌లు, సీఎస్ఏఎం, డీప్‌ఫేక్స్, బాట్ అకౌంట్లు, భారత చట్టాల అమలుపై ప్రభుత్వ ప్రశ్నలను ఎదుర్కొంటోంది.

దీంతో కంపెనీపై రెండు దేశాల్లోనూ నియంత్రణ సంస్థల పర్యవేక్షణ మరింత పెరిగింది.

ADVERTISEMENT