Loading...
Indian Embassy: న్యూయార్క్‌ టైమ్స్‌ కథనంపై భారత్‌ అభ్యంతరం.. PoKపై స్పష్టమైన ప్రకటన
న్యూయార్క్‌ టైమ్స్‌ కథనంపై భారత్‌ అభ్యంతరం.. PoKపై స్పష్టమైన ప్రకటన

Indian Embassy: న్యూయార్క్‌ టైమ్స్‌ కథనంపై భారత్‌ అభ్యంతరం.. PoKపై స్పష్టమైన ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)లో జరుగుతున్న ఘర్షణలపై అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన కథనం వివాదానికి దారితీసింది. ''స్థానిక ఎన్నికలు ప్రారంభం కావడంతో పాకిస్థాన్‌ కశ్మీర్‌లో హింస చెలరేగింది'' అనే శీర్షికతో వచ్చిన కథనంపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ కథనంలో ఉపయోగించిన పదజాలం వాస్తవాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, ''పాకిస్థాన్‌ కశ్మీర్‌ అనే ప్రాంతం అసలు లేదు. అది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (Pakistan-Occupied Kashmir) మాత్రమే'' అని పేర్కొంది. జమ్మూకశ్మీర్‌,లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని,వాటిలోని కొన్ని ప్రాంతాలను పాకిస్థాన్‌ అక్రమంగా ఆక్రమించిందని వెల్లడించింది.

వివరాలు 

ఆ ప్రాంత ప్రజలపై పాకిస్థాన్‌ దమనకాండ

ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలపై పాకిస్థాన్‌ దమనకాండ కొనసాగిస్తోందని కూడా ఆరోపించింది.

ఇదిలా ఉండగా, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ఆందోళనకారులపై పాకిస్థాన్‌ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆ ప్రాంతంలో పలు ఆంక్షలను అమలు చేస్తున్నారు.

మృతదేహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించకుండా అధికారులు నిషేధం విధించారు.

అలాగే ఆందోళనల్లో మరణించిన తమ కుటుంబ సభ్యుల మృతదేహాలను కూడా భద్రతా బలగాలు అప్పగించడం లేదని పలువురు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

వివరాలు 

ఎన్నికల నిర్వహణతో పాటు ప్రజల హక్కులను అణచివేస్తున్నారని నిరసనకారుల ఆరోపణ 

పెరుగుతున్న జీవన వ్యయం, పాలనలో లోపాలు, రాజకీయ వివక్ష వంటి అంశాలకు నిరసనగా కొనసాగుతున్న ఈ ఉద్యమానికి జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ నాయకత్వం వహిస్తోంది.

ఎన్నికల నిర్వహణతో పాటు ప్రజల హక్కులను అణచివేస్తున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.

కాగా, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలు నిర్వహించడంపై భారత్‌ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది.

ఆ ప్రాంతంలో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రపంచ దృష్టి నుంచి మళ్లించేందుకు పాకిస్థాన్‌ చేస్తున్న కపట ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఎన్నికలను నిర్వహిస్తోందని భారత్‌ తీవ్రంగా విమర్శించింది.

ADVERTISEMENT