Pakistan: పాకిస్థాన్లో విద్యా సంక్షోభం.. బడికి దూరమైన 2.6 కోట్ల మంది పిల్లలు
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ స్థాయిలో విద్యారంగంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి రెండేళ్లు గడిచినా, పాకిస్థాన్లో విద్యా సంక్షోభం మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం దేశంలో సుమారు 2.51 కోట్ల నుంచి 2.60 కోట్ల మంది పిల్లలు పాఠశాలలకు దూరంగా ఉన్నట్లు సివిల్ సర్వీసెస్ అకాడమీ (CSA) విడుదల చేసిన తులనాత్మక విధాన సమీక్ష వెల్లడించింది. సమస్య కొత్త విధానాల రూపకల్పనలో కాదని, వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. బలహీన పాలన,పరిపాలనా విభజన,విద్యకు తగినంత నిధులు కేటాయించకపోవడం, ప్రావిన్స్ల మధ్య తీవ్ర అసమానతలు విద్యారంగాన్ని దెబ్బతీస్తున్న ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది.
వివరాలు
దేశ జీడీపీ లో 1 శాతం దిగువకు విద్య
ముఖ్యంగా సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్స్లు తమ విద్యా బడ్జెట్లో 81 నుంచి 90 శాతం వరకు ఉద్యోగుల జీతాలకే ఖర్చు చేస్తున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలకు చాలా తక్కువ నిధులు మిగులుతున్నాయని వెల్లడించింది. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్కు చెందిన విద్యా ఆర్థిక నిపుణుడు డాక్టర్ ఫైసల్ బారి ప్రకారం, పాకిస్థాన్ విద్యపై చేస్తున్న మొత్తం ఖర్చు దేశ జీడీపీ లో 1 శాతానికి కూడా దిగువకు పడిపోయింది. ఐక్యరాజ్య సమితి సూచించిన 4 శాతం ప్రమాణానికి ఇది చాలా దూరంగా ఉందని ఆయన తెలిపారు. ప్రావిన్స్ల వారీగా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. పంజాబ్లో అత్యధికంగా 96 లక్షల నుంచి 1.04 కోట్ల మంది పిల్లలు పాఠశాలలకు దూరంగా ఉన్నారు.
వివరాలు
సింధ్లో పాఠశాలలకు వెళ్లని 74 లక్షల మంది పిల్లలు
ముఖ్యంగా చదువు మధ్యలో మానేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. దక్షిణ పంజాబ్లోని రాజన్పూర్ జిల్లాలో దాదాపు 48 శాతం మంది పిల్లలు బడిబాట పట్టడం లేదు. సింధ్లో సుమారు 74 లక్షల మంది పిల్లలు పాఠశాలలకు వెళ్లడం లేదు. ప్రాథమిక పాఠశాలలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉన్నత పాఠశాలల కొరత కారణంగా ప్రాథమిక విద్య పూర్తయ్యాక 54 శాతం మంది విద్యార్థులు చదువును కొనసాగించడం లేదని నివేదిక తెలిపింది. ఇటీవలి వరదలతో ప్రభుత్వ పాఠశాలల్లో సగం వరకు దెబ్బతిన్నట్లు పేర్కొంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో సుమారు 49 లక్షల మంది పిల్లలు విద్యకు దూరంగా ఉన్నారు. కొండ ప్రాంతాలు, భద్రతా సమస్యలు, మహిళా ఉపాధ్యాయుల కొరత ఇందుకు ప్రధాన కారణాలుగా గుర్తించింది.
వివరాలు
మరింత క్లిష్టంగా బలూచిస్థాన్ పరిస్థితి
బలూచిస్థాన్లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. మొత్తం 15,270 పాఠశాలల్లో 3,617 పాఠశాలలు పనిచేయడం లేదని లేదా పేరుకే ఉన్నాయని నివేదిక వెల్లడించింది. అక్కడ పాఠశాలలకు వెళ్లని పిల్లల్లో 78శాతం మంది బాలికలేనని పేర్కొంది. గ్రామీణ ఇస్లామాబాద్తో పాటు గిల్గిట్-బాల్టిస్తాన్, ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కూడా అనధికారిక నివాసాలు, దూర ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, తల్లుల్లో అక్షరాస్యత లేకపోవడం వంటి కారణాలతో డ్రాప్అవుట్లు అధికంగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. విద్యా నిపుణుడు డాక్టర్ అబ్దుల్ హమీద్ ప్రకారం, పాఠశాలలకు వెళ్లని పిల్లల్లో దాదాపు 30 శాతం మందికి ఏదో ఒక రకమైన వైకల్యం ఉంది. అయితే వారిని సాధారణ విద్యా వ్యవస్థలో భాగం చేసే చర్యలు తగినంతగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని సీఎస్ఏ నివేదిక
మరోవైపు, దేశంలోని 40 శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, నాణ్యమైన బోధన లేకపోవడం కూడా డ్రాప్అవుట్లకు కారణమవుతున్నాయని డాక్టర్ ఫైసల్ బారి తెలిపారు. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని సీఎస్ఏ నివేదిక సూచించింది. NADRA బీ-ఫారమ్తో అనుసంధానమైన జాతీయ విద్యార్థుల రిజిస్ట్రీ ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థిని రియల్టైమ్లో గుర్తించే వ్యవస్థను తీసుకురావాలని సిఫార్సు చేసింది. అలాగే అధికారిక, అనధికారిక విద్యా సమాచారాన్ని సమీకరించడం, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం, జిల్లా విద్యా అధికారులకు స్వతంత్ర అధికారాలు కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది.
వివరాలు
"రెండేళ్ల క్రితం ప్రకటించిన విద్యా ఎమర్జెన్సీ
ఇదిలా ఉండగా, పంజాబ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు, పంజాబ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా పాఠశాలల నిర్వహణ వంటి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. అయినప్పటికీ, జవాబుదారీతనం పెంచడంతో పాటు విద్యకు తగిన నిధులు కేటాయించకుండా ప్రకటించిన విద్యా ఎమర్జెన్సీ కేవలం పేరుకే పరిమితమవుతుందని సీఎస్ఏ నివేదిక హెచ్చరించింది.