Mohsin Naqvi: పాక్ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు.. 'యువత ఏకమైతే దేశాన్నే మార్చేస్తారు!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ లో పెరుగుతున్న ప్రజా అసంతృప్తి, యువతలో ఆగ్రహం, క్షీణిస్తున్న పాలనా వ్యవస్థపై ఆ దేశ హోంమంత్రి మొహ్సిన్ నక్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. సాధారణంగా ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేస్తుంటాయి. కానీ పాకిస్తాన్లో మాత్రం అంతర్గత వ్యవహారాల మంత్రే నిరాశలో ఉన్న యువత ఒక్కటైతే దేశాన్ని మార్చగల శక్తి వారిలో ఉందని హెచ్చరించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. ఇస్లామాబాద్లో నిర్వహించిన పాకిస్తాన్ ఎకనామిక్ సమ్మిట్లో పాల్గొన్న మొహ్సిన్ నక్వీ, దేశంలోని ప్రస్తుత పాలనా వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వివరాలు
వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది
ప్రస్తుతం అమలవుతున్న విధానాలతో దేశ సమస్యలకు పరిష్కారం దొరకదని, పరిపాలనా వ్యవస్థలో మూలస్థాయి సంస్కరణలు తప్పనిసరని ఆయన అన్నారు.
ప్రస్తుతం మనం జీవిస్తున్న వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది.
ఇదే విధానంతో సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదు. నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టకపోతే మరో పదేళ్ల తర్వాత కూడా ఇవే సమస్యలపై చర్చించాల్సిన పరిస్థితి వస్తుందని నక్వీ వ్యాఖ్యానించారు.
వివరాలు
బొద్దింకలైనా సరే... ఒక్కటైతే అన్నింటినీ మార్చేస్తాయి
దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, వారికి కేవలం ఆర్థిక సాయం కాకుండా ఉద్యోగ అవకాశాలు, ప్రతిభకు గుర్తింపు, న్యాయమైన వ్యవస్థ అవసరమని ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు కావాల్సింది న్యాయం, ప్రతిభకు విలువ, ఉద్యోగ అవకాశాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య సంచలనంగా మారింది.
ఆ యువకుడిని యువత అనండి... బొద్దింక అనండి... ఇంకేదైనా అనండి. కానీ ఆ బొద్దింకలన్నీ ఒక్కటైతే అన్నింటినీ తలకిందులు చేయగలవని అన్నారు.
నక్వీ నేరుగా ఏ నిరసన ఉద్యమాన్ని ప్రస్తావించకపోయినా, ఇటీవల భారత్లో జరిగిన సీజేఐ (CJP) ఉద్యమం, దాని రాజకీయ ప్రభావాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
వివరాలు
ఆసిమ్ మునీర్పై కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆసిమ్ మునీర్ పాత్రపై కూడా నక్వీ స్పందించారు.
మునీర్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కటే దేశ సమస్యలను పరిష్కరించలేవని, రాజకీయ నాయకులు కలిసి పాలనా వ్యవస్థను సంస్కరించకపోతే శాశ్వత ఫలితాలు రావని అన్నారు.
రాజకీయ నాయకులు దేశ వ్యవస్థను సరిచేయకపోతే ఫీల్డ్ మార్షల్ చేస్తున్న కృషికి ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
మునీర్ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచబోనని పలుమార్లు స్పష్టం చేశారని గుర్తుచేసిన నక్వీ, అన్ని రాజకీయ పార్టీలు కలిసి దేశ పరిపాలనను మెరుగుపర్చేందుకు పనిచేయాలని సూచించారు.
ప్రధాని షెహబాజ్ షరీఫ్ రోజుకు 12నుంచి 14గంటలు పనిచేస్తున్నప్పటికీ, వ్యవస్థలో సంస్కరణలు లేకపోతే ఆ కృషి సమస్యలపై తాత్కాలిక చర్యలకే పరిమితమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
వ్యవస్థాగత సంస్కరణలే పరిష్కారం
భారీ అప్పులు, బలహీన పాలనా వ్యవస్థ, మందగించిన అధికార యంత్రాంగం, పెరుగుతున్న నిరుద్యోగం, ప్రతిభ ఆధారంగా అవకాశాలు లేకపోవడం వంటి సమస్యలు పాకిస్తాన్ను తీవ్రంగా వెంటాడుతున్నాయని మొహ్సిన్ నక్వీ పేర్కొన్నారు.
ఈ సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు కాకుండా, వ్యవస్థాగత సంస్కరణలే శాశ్వత పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.
బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభం, రాజకీయ విభేదాల మధ్య దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి ఎంత ప్రమాదకర స్థాయికి చేరుకుందో పాలక వర్గాల్లోనే చర్చకు రావడం పాకిస్తాన్ భవిష్యత్ రాజకీయాలపై ఆసక్తిని మరింత పెంచుతోంది.