
Russia-Ukraine: 350 డ్రోన్లు, 11 క్షిపణులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడిన రష్యా!
ఈ వార్తాకథనం ఏంటి
ఇక యుద్ధం ఆగే సూచనలు కనబడకపోగా రష్యా, ఉక్రెయిన్పై దాడులను ముమ్మరం చేసింది. కాల్పుల విరమణ కోసం మంతనాలు జరుగుతున్నప్పటికీ రష్యా తాజాగా మాస్కో నుంచి కీవ్పై 350కిపైగా డ్రోన్లు, 11 క్షిపణులను ప్రయోగించింది. ఉక్రెయిన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడుల్లో 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, అనేక నివాస భవనాలు, ఆస్పత్రులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించడం కోసం భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తుండగా, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
Details
ఉత్తర కొరియా ఆయుధాలతో దాడులు
కీవ్పై రష్యా చేసిన తాజా దాడుల్లో ఉత్తర కొరియాకు చెందిన ఆయుధాలను వినియోగించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. కిమ్ రష్యాకు ఆయుధాలు, సైన్యం అందిస్తే యుద్ధం మరింత ఉద్ధృతమవుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలను కోరిన జెలెన్స్కీ, సోమవారం యూకే పర్యటనలో భాగంగా తమ రక్షణ మంత్రి ఈ విషయాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తెస్తారన్నారు. అలాగే ఈ వారం హేగ్లో జరిగే నాటో శిఖరాగ్ర సమావేశానికి ముందు లండన్లో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో సమావేశం కావనున్నట్లు వెల్లడించారు.
Details
యుద్ధాన్ని ఉధృతం చేస్తున్న పుతిన్
రష్యా దాడులపై అమెరికా మౌనమే ఉక్రెయిన్ ప్రజల మరణాలకు కారణమని జెలెన్స్కీ వాపోయారు. పుతిన్ యుద్ధాన్ని ఉద్ధృతం చేస్తూ ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ నాటో సభ్యత్వం పొందకపోవడం, క్రిమియా, ఇతర నాలుగు ప్రావిన్స్లు రష్యాకు చెందాయని అంగీకరిస్తే యుద్ధం ముగింపుపై ఆలోచిస్తానని పుతిన్ పలుమార్లు పేర్కొన్నారు.