LOADING...
Russia-ukraine War: ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా .. 18 మంది మృతి
ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా .. 18 మంది మృతి

Russia-ukraine War: ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా .. 18 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2026
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది. దేశంలోని పలు నగరాలను లక్ష్యంగా చేసుకుని 656 డ్రోన్లు, 73 క్షిపణులతో దాడులు జరపడంతో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 131 మంది గాయపడ్డారు. నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా వెనుకబడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం, అలాగే అమెరికా తయారీ గగనతల రక్షణ వ్యవస్థల కొరత ఉక్రెయిన్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దాడుల తీవ్రతను పెంచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా దాడుల అనంతరం ద్నిప్రో నగరంలో భవనాల శిథిలాల కింద ఒక మహిళతో పాటు ఆమె ఇద్దరు చిన్నారుల మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి.

వివరాలు 

కీవ్‌లోనే 79 మందికి గాయాలు 

ఈ నగరంలోనే మొత్తం 12 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. రాత్రి ప్రారంభమైన దాడులు తెల్లవారుజాము వరకు కొనసాగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇటీవల రష్యా, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై భారీ దాడులు జరగనున్నాయని హెచ్చరిస్తూ విదేశీ దౌత్యవేత్తలు నగరాన్ని విడిచి వెళ్లాలని సూచించింది. తాజా దాడుల్లో కీవ్‌లోనే 79 మంది గాయపడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, రష్యా ప్రయోగించిన 40 క్షిపణులు, 602 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని ఉక్రెయిన్ వాయుసేన ప్రకటించింది. అలాగే తమ సైనిక సంబంధిత పరిశ్రమలపై కూడా దాడులు జరిగినట్లు వెల్లడించింది. అయితే దాడులను నిలిపివేసే ప్రసక్తే లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేసినట్లు సమాచారం.

Advertisement