Loading...
Nepal floods : నేపాల్‌లో వరద బీభత్సం: ముందే హెచ్చరించిన ఉపగ్రహ చిత్రాలు.. పట్టించుకోని అధికారులు
పట్టించుకోని అధికారులు

Nepal floods : నేపాల్‌లో వరద బీభత్సం: ముందే హెచ్చరించిన ఉపగ్రహ చిత్రాలు.. పట్టించుకోని అధికారులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2026
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ వరదకు కొన్ని రోజుల ముందే ప్రమాద సూచనలు కనిపించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైరిస్క్‌ (HiRISK) బృందం చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం.. వరదకు కారణమైన మంచు-రాళ్ల భారీ కొండచరియ విరిగిపడే ఘటనకు ముందే ఉపగ్రహ చిత్రాల్లో కొన్ని మార్పులు గుర్తించవచ్చని వెల్లడైంది. లాంగ్‌టాంగ్ లిరుంగ్ పర్వత ప్రాంతంలో హిమనదం (గ్లేసియర్‌),దాని కింద ఉన్న కొండరాళ్లలో కొంత భాగం ఒక్కసారిగా విడిపోయి కిందికి జారిపడింది. ఈ ఘటనతో భారీగా మంచు, రాళ్లు,మట్టి లోయలోకి దూసుకెళ్లాయి. అనంతరం లెండే ఖోలా నదిలో నీరు,మట్టి,రాళ్ల ప్రవాహం వేగంగా పెరిగి భోటే కోషి-త్రిశూలి నదీ వ్యవస్థ వెంట భారీ వరదగా మారింది.

వివరాలు 

ఉపగ్రహ చిత్రాల్లో ముందే కనిపించిన గ్లేసియర్‌ ప్రమాద సూచనలు

ఈ వరద నేపాల్‌లోని పలు ప్రాంతాలతో పాటు చైనా సరిహద్దులోని టిబెట్ ప్రాంతాన్నీ తీవ్రంగా దెబ్బతీసింది.

ఈ ఘటనకు ముందు తీసిన ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన శాస్త్రవేత్తలకు కొన్ని ఆందోళనకరమైన సంకేతాలు కనిపించాయి.

హిమనదంలోని నీటి ప్రవాహం వేగం పెరిగినట్లు చిత్రాల్లో గుర్తించారు.

దీని వల్ల గ్లేసియర్‌లోపల ఏదో మార్పు జరుగుతోందని, దాని చుట్టూ ఉన్న రాతి ప్రాంతం కూడా బలహీనపడుతోందని అంచనా వేయవచ్చు.

అయితే ఇలాంటి మార్పులు కనిపించడం వల్ల వెంటనే భారీ విపత్తు సంభవిస్తుందని ఖచ్చితంగా చెప్పలేమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

వివరాలు 

వరదకు రెండు రోజుల ముందే బయటపడ్డ ప్రమాద సూచనలు

వరదకు రెండు రోజుల ముందు తీసిన చిత్రాల్లో మరో రెండు కీలక మార్పులు కనిపించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గ్లేసియర్‌ నుంచి కరుగుతున్న నీరు సాధారణంగా కనిపించే రంగులో కాకుండా గోధుమ రంగులోకి మారింది.

అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న కొండ వాలులో పగుళ్లు ఏర్పడి అవి రాతి ప్రాంతంలోకి విస్తరిస్తున్నట్లు గుర్తించారు.

గ్లేసియర్‌, దాని చుట్టూ ఉన్న కొండల్లో క్రమంగా అస్థిరత పెరుగుతోందనే సంకేతాలుగా వీటిని పరిగణించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ మార్పులను ముందుగానే గుర్తించి అధికారులకు సమాచారం చేరి ఉంటే.. నదికి దిగువ ప్రాంతాల్లో పనిచేస్తున్నవారిని అప్రమత్తం చేయడం, ప్రమాద ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలకు అవకాశం ఉండేదని హైరిస్క్‌ అంచనా పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

హిమనదాలపై AI నిఘా.. విపత్తులకు ముందే హెచ్చరికలు

కనీసం 10 నిమిషాల ముందే హెచ్చరిక అందితే.. దిగువ ప్రాంతాల్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉండేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా ఇలాంటి ప్రకృతి విపత్తులు చోటుచేసుకున్న నేపథ్యంలో.. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఉపగ్రహ చిత్రాలను కృత్రిమ మేధ (AI) సాయంతో నిరంతరం విశ్లేషించడం ద్వారా వేలాది హిమనదాలు ఉన్న హిమాలయ ప్రాంతంలో ప్రమాదాలను ముందుగానే గుర్తించవచ్చని భూగర్భ శాస్త్రవేత్త, నివేదిక సహ రచయిత జాకబ్ స్టైనర్ తెలిపారు.

చేరుకోవడం కష్టమైన పర్వత ప్రాంతాల్లో ప్రమాదాలను గుర్తించేందుకు ఇలాంటి సాంకేతికతను మరింతగా ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు.

ADVERTISEMENT