Iran Attack on Saudi: రాస్ తనురా రిఫైనరీపై మరోసారి దాడి.. ఇరాన్ చర్యలతో గల్ఫ్ లో ఉద్రిక్తత
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ తాజాగా తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. ముఖ్యంగా కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా వంటి దేశాలపై ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అతిపెద్ద చమురు సంస్థలలో ఒకటైన సౌదీ అరామ్కోకు చెందిన రాస్ తనురా రిఫైనరీపై ఇరాన్ దాడి చేసింది. ఈ రోజు కూడా ఆ రిఫైనరీపై మరోసారి దాడి జరిగినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. అరామ్కో కాంప్లెక్స్లో దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. సౌదీ అరేబియా ఇంధన రంగానికి ఇది అత్యంత కీలక కేంద్రంగా గుర్తించారు.
వివరాలు
ఇరాన్ షాహెద్ ఆత్మాహుతి డ్రోన్లతో ఇదే తరహా దాడి
"రాస్ తనురా శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి ప్రయత్నించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దాడి డ్రోన్ ద్వారా జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎటువంటి నష్టం జరగలేదు" అని ప్రతినిధి తెలిపారు. సోమవారం కూడా ఇరాన్ షాహెద్ ఆత్మాహుతి డ్రోన్లతో ఇదే తరహా దాడి చేసింది. ఆ దాడి కారణంగా సౌదీ అరామ్కో సంస్థ రాస్ తనురా రిఫైనరీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.
వివరాలు
సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ప్రసిద్ధి
సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ప్రసిద్ధి చెందింది. దేశంలోని ప్రధాన చమురు క్షేత్రాలు మరియు పెట్రోలియం మౌలిక వసతులు తూర్పు తీర ప్రాంతంలో ఉన్నాయి. ఇవన్నీ గల్ఫ్ ప్రాంతం వైపు ఉండటం వల్ల ఇరాన్కు భౌగోళికంగా దగ్గరగా ఉంటాయి. ఈ వారం ప్రారంభంలో జరిగిన మొదటి డ్రోన్ దాడి అనంతరం సౌదీ అరేబియా ఎల్పీజీ గ్యాస్ ఎగుమతులను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రొపేన్,బ్యూటేన్ ఎగుమతులను నిలిపివేయాలని అరామ్కో తీసుకున్న నిర్ణయం మరికొన్ని వారాల పాటు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.