LOADING...
Sergio Gore: భారత్‌కు అమెరికా రాయబారిగా సెర్జియో గోర్ నియామకం.. ఆమోదముద్ర వేసిన అమెరికా సెనేట్
ఆమోదముద్ర వేసిన అమెరికా సెనేట్

Sergio Gore: భారత్‌కు అమెరికా రాయబారిగా సెర్జియో గోర్ నియామకం.. ఆమోదముద్ర వేసిన అమెరికా సెనేట్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2025
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశానికి అమెరికా రాయబారిగా డొనాల్డ్ ట్రంప్‌కి అత్యంత సన్నిహితుడైన, విశ్వసనీయుడైన సెర్జియో గోర్‌(38) నియామకం ఖరారు అయ్యింది. మంగళవారం అమెరికా సెనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఆయన నియామకానికి మద్దతు లభించింది. ఈ నియామకంతో సెర్జియో గోర్ అమెరికాలో అత్యంత చిన్న వయసులో భారత్‌కు రాయబారి‌గా పని చేసే వ్యక్తిగా రికార్డు స్థాపించనున్నారు. ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు కూడా ఆయన అత్యంత సన్నిహితుడు.

వివరాలు 

గోర్ పేరును రాయబారి పదవికి ప్రతిపాదించిన ట్రంప్ 

గతంలో ట్రంప్ పరిపాలనలో 4,000 కి పైగా కీలకమైన నియామకాలను పర్యవేక్షించిన వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డైరెక్టర్‌గా గోర్ సేవలందించారు. ఆగస్టు 22న, తన స్వంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్‌' ద్వారా ట్రంప్ గోర్ పేరును రాయబారి పదవికి ప్రతిపాదించారు. "ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న ప్రాంతానికి, నా విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నేను పూర్తిగా విశ్వసించగల వ్యక్తి అవసరం. సెర్జియో అద్భుతమైన రాయబారి అవుతారు" అని ట్రంప్ ఆనాడు పేర్కొన్నారు.

వివరాలు 

రక్షణ, వాణిజ్య సంబంధాలే తన ప్రాధాన్యత అని వెల్లడి 

సెప్టెంబర్‌లో జరిగిన సెనేట్ హియరింగ్‌లో సెర్జియో గోర్ మాట్లాడుతూ, "భారతదేశం ఒక కీలక వ్యూహాత్మక భాగస్వామి. ఆ దేశ భౌగోళిక ఉనికి, ఆర్థిక వృద్ధి, సైనిక సామర్థ్యాలు ఈ ప్రాంతంలో స్థిరత్వానికి ప్రధాన మూలస్తంభాలు" అని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం, న్యాయమైన వాణిజ్యం, ఇంధన భద్రత, సాంకేతికత రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేయడమే తన ముఖ్య లక్ష్యమని తెలిపారు. గోర్ వివరించగా, "రెండు దేశాల మధ్య సైనిక విన్యాసాలను విస్తరించడం, రక్షణ వ్యవస్థల ఉమ్మడి అభివృద్ధి, ముఖ్యమైన ఆయుధ ఒప్పందాలను పూర్తి చేయడం నా ప్రాధాన్యతల్లో ఉన్నాయి" అని చెప్పారు.

వివరాలు 

 ఎస్. జైశంకర్‌తో న్యూయార్క్‌లో భేటీ అయిన సెర్జియో గోర్

భారత్‌లో ఉన్న 140 కోట్ల జనాభా, వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి వర్గం అమెరికాకు అపారమైన వ్యాపార, సాంకేతిక,భవిష్యత్తు అవకాశాలను అందిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మాస్యూటికల్స్, సాంకేతికత మరియు పరిశ్రమల విభాగాలలో విస్తృత స్థాయిలో సహకారం సాధించడానికి రెండు దేశాల మధ్య పెద్ద అవకాశాలు ఉన్నాయని గోర్ అభిప్రాయపడ్డారు. కాగా,ఇటీవల, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సమయంలో సెర్జియో గోర్ భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో న్యూయార్క్‌లో భేటీ అయ్యారు. రాయబారి పదవితో పాటు, గోర్ దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారి బాధ్యతలను కూడా నిర్వహించనున్నారు.