Spain: స్పెయిన్లో కార్చిచ్చు బీభత్సం.. 12కు పెరిగిన మృతుల సంఖ్య
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ స్పెయిన్లోని అల్మెరియా ప్రాంతంలో సంభవించిన భారీ కార్చిచ్చు మరింత విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో మరో ఆరుగురు మృతదేహాలు గుర్తించడంతో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. అండలూసియా ప్రాంతీయ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, లాస్ గల్లార్డోస్ ప్రాంతంలో కొనసాగుతున్న అగ్నిప్రమాదంలో అదనంగా ఆరుగురు మరణించిన విషయం నిర్ధారణ అయింది. దీంతో ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12కు పెరిగింది.
వివరాలు
పలు రహదారులు తాత్కాలికంగా మూసివేత
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, విద్యుత్ తీగ తెగి ఎండిపోయిన వృక్ష సంపదపై పడటంతో మంటలు చెలరేగి ఉండొచ్చని భావిస్తున్నారు. అనంతరం అవి వేగంగా సమీప అటవీ ప్రాంతాలకు వ్యాపించాయి. అయితే అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటనే అంశాన్ని అధికారులు ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. మంటలు వేగంగా విస్తరించడంతో పలు రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాద ప్రాంతాల్లోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 50 మందికి సమీపంలోని ఒక సాంస్కృతిక కేంద్రంలో తాత్కాలిక ఆశ్రయం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జువాన్మా మోరెనో
అగ్నిమాపక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు స్పెయిన్ సైన్యానికి చెందిన అత్యవసర విభాగం (UME) రంగంలోకి దిగనుంది. రాబోయే గంటల్లో ఈ బృందం అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. అండలూసియా ప్రాంతీయ ప్రభుత్వ అధిపతి జువాన్మా మోరెనో ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, దీనిని అత్యంత విషాదకర సంఘటనగా అభివర్ణించారు. "మా హృదయాలు బరువెక్కాయి.. ఈ విషాదం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది" అని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
వివరాలు
తీవ్ర వేడిగాలుల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న స్పెయిన్
స్పెయిన్ ప్రస్తుతం తీవ్ర వేడిగాలుల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇటీవల అండలూసియాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరడంతో రెండో అత్యున్నత స్థాయి అయిన ఆరెంజ్ వాతావరణ హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అడవి మంటలను నియంత్రించేందుకు ఈ ఏడాది చరిత్రలోనే అతిపెద్ద వేసవి కార్చిచ్చు నివారణ కార్యాచరణను అమలు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ మే నెలలో ప్రకటించారు. ఇటీవలి సంవత్సరాల్లో స్పెయిన్లో ఉష్ణోగ్రతలు తరచుగా 40 డిగ్రీల సెల్సియస్ను దాటుతుండటంతో, సుదీర్ఘ వడగాలులు భారీ కార్చిచ్చులకు అనుకూల పరిస్థితులను సృష్టిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.