Donald Trump : 'హర్మూజ్ జలసంధి అమెరికా భూభాగమే'.. ట్రంప్ సంచలన ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని 'అమెరికా కొత్త భూభాగం'గా అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆదివారం తన ట్రూత్ సోషల్ ఖాతాలో హర్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంగా చూపిస్తున్న ఓ మ్యాప్ను ట్రంప్ మరోసారి పోస్ట్ చేశారు. ఇరాన్పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రంప్ గతంలోనూ హర్మూజ్ జలసంధిపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సౌత్ కరోలినాలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. హర్మూజ్ జలసంధిని తాను ప్రస్తుతం అమెరికా భూభాగంగానే చూస్తున్నానని స్పష్టం చేశారు.
వివరాలు
రాకపోకలను అమెరికానే నియంత్రిస్తోంది
ఇరాన్ నౌకలు, ఓడరేవులపై అమెరికా నావికాదళం దిగ్బంధనం కొనసాగిస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హర్మూజ్ జలసంధి గుండా జరిగే రాకపోకలను అమెరికాయే నియంత్రిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ జలమార్గాన్ని అధికారికంగా అమెరికా భూభాగంగా ప్రకటించే ఆలోచనను కూడా గతంలో ప్రస్తావించారు.
ప్రపంచ సముద్ర చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు హర్మూజ్ జలసంధి మీదుగానే జరుగుతుండటంతో ఈ ప్రాంతానికి వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం ఉంది.
వివరాలు
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఆగ్రహం
హర్మూజ్ జలసంధిపై ట్రంప్ చేస్తున్న వాదనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అవి కేవలం 'భ్రమలు' మాత్రమేనని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కజెం ఘరిబబాది కొట్టిపారేశారు.
అమెరికా తన హామీలను నెరవేర్చి, వైఖరిని మార్చుకునే వరకు హర్మూజ్ జలసంధిని మూసే ఉంచుతామని సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహసెన్ రెజాయీ సహా పలువురు ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు.
ఇరాన్పై అమెరికా కొత్తగా విధించబోయే ఆంక్షలను కూడా టెహ్రాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెంచే అవకాశం ఉందని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇరాన్పై విధించనున్న కొత్త ఆంక్షల వివరాలను అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం.
వివరాలు
ఇరాన్పై అత్యంత కఠిన ఆంక్షలకు అమెరికా సిద్ధం
ఇప్పటివరకు ఇరాన్పై విధించిన ఆంక్షల్లో ఇవే అత్యంత కఠినమైనవిగా ఉండొచ్చని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, చమురు వాణిజ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఆంక్షలను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ ప్రాంతంలో అమెరికా చేపట్టిన దిగ్బంధనం కారణంగా నౌకా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అయితే కొన్ని నౌకలు అమెరికా భద్రత మధ్య లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణిస్తున్నాయి.
మరోవైపు అంతర్జాతీయ చట్టాల ప్రకారం హర్మూజ్ వంటి అంతర్జాతీయ జలసంధులపై ఏ ఒక్క దేశానికీ పూర్తి ఆధిపత్యం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు.
దీంతో హర్మూజ్పై ట్రంప్ చేస్తున్న వాదనలు అంతర్జాతీయంగా మరింత చర్చకు దారితీస్తున్నాయి.