Imran Khan: ఇమ్రాన్ ఖాన్కు భారీ షాక్; తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష.. అరెస్టు
తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ను ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు దోషిగా తేలింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే రూ.100,000జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్పై అభియోగాలు రుజువైనట్లు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి హుమాయున్ దిలావర్ తీర్పు చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ఎన్నికల కమిషన్కు నకిలీ వివరాలను సమర్పించారని, అవినీతి చర్యలకు పాల్పడినట్లు తేలిందని దిలావర్ వెల్లడించారు. ఎన్నికల చట్టంలోని సెక్షన్ 174 ప్రకారం పిటిఐ చీఫ్కు మూడేళ్ల జైలు శిక్షపడింది. అనంతరం ఇమ్రాన్ను భారీ భద్రత నడుమ అరెస్టు చేశారు.
ఇమ్రాన్కు భారీ ఎదురుదెబ్బ
తోషఖానా కేసు ఇదీ..
పాకిస్థాన్ ప్రభుత్వం 1974లో తోషఖానాను ఏర్పాటు చేసింది. తోషఖానా డిపార్ట్మెంట్లో ప్రభుత్వంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు అందుకున్న బహుమతులు, ఇతర ఖరీదైన వస్తువులను స్టోర్ భద్రపరుస్తారు. అధికారులు తమకు అందిన బహుమతులు, ఇతర వస్తువులను కాబినెట్ విభాగానికి నివేదించడం తప్పనిసరి. ఇందులో ప్రెసిడెంట్, ప్రధాన మంత్రికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఈ ఇద్దరు రూ.30,000(పాక్ కరెన్సీలో)కంటే తక్కువ విలువ చేసే బహుమతులను తమ వద్దే ఉంచుకోవచ్చు. ఎక్కువ విలువ చేసే వస్తువులు, బహుమతులను, ప్రభుత్వం అంచనా వేసిన విలువలో 50శాతం చెల్లించి వాటిని వారు తమ వద్ద ఉంచుకోవచ్చు. కానీ ఇమ్రాన్ తను ప్రధానిగా ఉన్న కాలంలో కేవలం 20శాతం మాత్రమే చెల్లించి ఖరీదైన బహుమతులు, వస్తువులను తోషఖానా నుంచి తీసుకున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
తోషఖానా కేసు ఇలా బయటకు వచ్చింది
ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ 2018లో అధికారంలోకి వచ్చింది. ఇమ్రాన్ తన పదవీకాలంలో అందుకున్న విలువైన బహుమతులు, వస్తువుల వివరాలను కోరుతూ ఓ జర్నలిస్టు ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. వివరాలు చెప్పడానికి ఇమ్రాన్ నిరాకరించడంతో వివాదం మొదలైంది. వస్తువుల వివరాలను వెల్లడిస్తే, విదేశాలతో సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళనలను పేర్కొంటూ ఇమ్రాన్ ప్రభుత్వం ఆర్టీఐ అభ్యర్థనను తిరస్కరించింది. ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన తోషాఖానా వివరాలను వెల్లడించేందుకు క్యాబినెట్ కూడా నిరాకరించడంతో సదరు జర్నలిస్ట్ ఫెడరల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరుకోవడంతో వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత వరుస వివాదాలు చుట్టు ముట్టి ఇమ్రాన్ ప్రభుత్వం కూలిపోయింది. పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ పార్టీ అధికారాన్ని చేపట్టింది.
ఇమ్రాన్ ఖాన్పై 5ఏళ్ల పాటు అనర్హత వేటు
తోషాఖానా కేసులో అరెస్టయి మూడేళ్ల జైలు శిక్ష పడినందున, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పదవులకు అనర్హుడరయ్యారు. ఐదేళ్లపాటు ఆయన ఏ ప్రభుత్వ పదవిలో కొనసాగడానికి అర్హుత లేదు. ఈ మేరకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు నేపథ్యంలో అతని ఇల్లు జమాన్ పార్క్ వెలుపల భారీ పోలీసు బలగాలను మోహరించారు. జమాన్ పార్క్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే ఎన్ని ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నా, ఇమ్రాన్ మద్దతుదారులు, వీధుల్లోకి వచ్చిన నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే, ఇస్లామాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, ఇమ్రాన్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.