Trump: 22 కోట్ల అమెరికన్ ఓటర్ల సమాచారం చోరీ.. చైనాపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాకు చెందిన కోట్లాది మంది ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చైనా అక్రమంగా సేకరించిందని ఆయన ఆరోపించారు. అమెరికా ఎన్నికల చరిత్రలోనే ఇది అతిపెద్ద డేటా ఉల్లంఘన (డేటా బ్రీచ్)గా అభివర్ణించారు. ప్రైమ్టైమ్ ప్రసంగంలో ఎన్నికల భద్రతపై మాట్లాడిన ట్రంప్, సుమారు 22 కోట్ల (220 మిలియన్ల) అమెరికన్ ఓటర్లకు సంబంధించిన డేటా చైనా చేతికి వెళ్లిందన్నారు.
వివరాలు
అమెరికా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిన చైనా
ఇటీవల గోప్యత నుంచి విడుదల చేసిన నిఘా పత్రాల ప్రకారం చైనా పెద్ద ఎత్తున అమెరికా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు పేర్కొన్నారని తెలిపారు.
ఆ వివరాల్లో ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, రాజకీయ పార్టీ అనుబంధం వంటి సున్నితమైన సమాచారం ఉందని చెప్పారు.
ఈ డేటాను ఓటరు నమోదు ప్రక్రియతో పాటు ఇతర దురుద్దేశపూర్వక కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు.
వివరాలు
'డీప్ స్టేట్ కీలక సమాచారాన్ని దాచింది'
చైనా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు ఉన్న కీలక నిఘా సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థలోని కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ట్రంప్ ఆరోపించారు.
తన తొలి అధ్యక్ష పదవీకాలంలో ఈ సమాచారాన్ని తనకు, అమెరికా ప్రజలకు తెలియకుండా అడ్డుకున్నారని విమర్శించారు.
ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని జాతీయ నిఘా విభాగం (ODNI), న్యాయశాఖ (DOJ), ఎఫ్బీఐ (FBI), సీఐఏ (CIA)లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.
సమాచారాన్ని దాచిపెట్టిన అధికారులపై అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగింపుతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని సూచించినట్లు చెప్పారు.
వివరాలు
2020 ఎన్నికలపై మళ్లీ ఆరోపణలు
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు.
ఆ ఎన్నికల్లో ఉపయోగించిన కొన్ని ఓటింగ్ యంత్రాల్లో లోపాలు ఉన్నాయని, ఎన్నికల వ్యవస్థలో పలు బలహీనతలు బయటపడ్డాయని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఎన్నికల భద్రతను మరింత బలోపేతం చేసేలా కఠినమైన ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఓటర్లకు పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదన
ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ఓటరు నమోదులో అమెరికా పౌరసత్వాన్ని నిరూపించే అధికారిక పత్రాలు తప్పనిసరి చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు.
ఫొటో గుర్తింపు కార్డు (Photo ID) లేకుండా ఓటు హక్కు ఇవ్వకూడదని సూచించారు.
అలాగే రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఓటర్ల సమాచార మార్పిడిని మరింత సమర్థంగా నిర్వహించాలని కోరారు.
ఈ లక్ష్యంతో రిపబ్లికన్ పార్టీ మద్దతిస్తున్న SAVE America Act వంటి చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వివరాలు
ఆరోపణలకు ప్రత్యక్ష ఆధారాలు లేవు
అయితే తన ప్రసంగంలో ట్రంప్ చేసిన ఆరోపణలకు సంబంధించిన ప్రత్యక్ష ఆధారాలను మాత్రం వెల్లడించలేదు.
మరోవైపు అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం,చైనా ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసి ఉండవచ్చన్న అనుమానాలు ఉన్నప్పటికీ, 2020 ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును మార్చిందని లేదా తుది ఫలితాలను ప్రభావితం చేసిందని నిర్ధారించే ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
ఇక 2020 ఎన్నికల ఫలితాలను ట్రంప్ గతంలో కూడా పలుమార్లు ప్రశ్నించారు.
అయితే అమెరికా కోర్టులు, రీకౌంట్లు,అధికారిక సమీక్షల్లో ఎన్నికల ఫలితాన్ని మార్చే స్థాయిలో అక్రమాలు జరిగాయని నిరూపించే ఆధారాలు వెలుగులోకి రాలేదు.
అయినప్పటికీ ఎన్నికల భద్రత అంశాన్ని మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు తీసుకురావాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.