Trump: డెనా కరారీ విడుదలతో మారిన స్వరం.. ఇరాన్కు ట్రంప్ ధన్యవాదాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు ఇరాన్పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతుండగా,మరోవైపు అదే దేశానికి ట్రంప్ బహిరంగంగా కృతజ్ఞతలు తెలపడం విశేషంగా మారింది. ఇందుకు కారణం అమెరికా-ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన డెనా కరారీ విడుదల కావడమే.2024 డిసెంబర్ నుంచి ఇరాన్లో నిర్బంధంలో ఉన్న డెనా కరారీకి తాజాగా స్వేచ్ఛ లభించింది. ఆమె విడుదలను ఇరాన్ ప్రభుత్వం చూపిన 'సద్భావ సంకేతం'గా అభివర్ణించిన ట్రంప్..ఆ దేశానికి ధన్యవాదాలు తెలిపారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో స్పందిస్తూ.. డెనా ప్రస్తుతం ఇరాన్ వెలుపల సురక్షితంగా ఉన్నారని,ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందని పేర్కొన్నారు.
వివరాలు
కుటుంబ సభ్యులను కలిసేందుకు 2024లో ఇరాన్కు వెళ్లిన డెనా కరారీ
ఈ నిర్ణయాన్ని అమెరికా స్వాగతిస్తోందని ఆయన వెల్లడించారు.
ట్రంప్ చేసిన పోస్టు అనంతరం ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది జారెడ్ జెన్సర్ స్పందిస్తూ విడుదలైన మహిళ డెనా కరారీయేనని ధృవీకరించారు.
కుటుంబ సభ్యులను కలిసేందుకు 2024లో ఇరాన్కు వెళ్లిన ఆమెను అక్కడి అధికారులు దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకున్నారు.
అనంతరం 2025లో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల తర్వాత ఆమెపై గూఢచర్యం ఆరోపణలు నమోదు చేసినట్లు వెల్లడించారు.
డెనా కరారీ అమెరికాలోని ఒక టెక్నాలజీ సంస్థలో ఉద్యోగం చేస్తూనే,ఇరాన్లో పేద పిల్లల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థను కూడా నిర్వహించేవారు.
ఆమె విడుదల కోసం ట్రంప్ ప్రభుత్వం నిరంతరంగా దౌత్యపరమైన ప్రయత్నాలు చేయడం కీలకంగా మారిందని జారెడ్ జెన్సర్ తెలిపారు.
వివరాలు
ఖైదీల విడుదలలో జెన్సర్ కీలక పాత్ర
ప్రస్తుతం డెనా అమెరికాకు తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
గత రెండు దశాబ్దాల కాలంలో 20 దేశాల్లో 340 మందికిపైగా ఖైదీల విడుదలలో జెన్సర్ కీలక పాత్ర పోషించిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది.
ఇదిలా ఉండగా, ఇరాన్తో చర్చలు జరిపేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు.
ఇరాన్ చర్చలు కోరుకుంటోందని, వారితో ఒప్పందం కుదిరే అవకాశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు.
అయితే ఇరాన్ సక్రమంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని హెచ్చరించారు.
అలా కాకుండా ఘర్షణలను కొనసాగిస్తే ఇరాన్ త్వరలోనే ఓటమి ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.
అయితే ఈ చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే అంశంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు.
వివరాలు
ఇరాన్ పై అమెరికా రెండో విడత సైనిక దాడులు
మరోవైపు హర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఇరాన్కు చెందిన తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అమెరికా రెండో విడత సైనిక దాడులు కొనసాగిస్తోంది.
దీనికి స్పందించిన ఇరాన్.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తమ దేశ ఉనికితో ముడిపడినవని పేర్కొంది.
అవసరమైతే ప్రాంతీయ ఇంధన ఎగుమతులకు అంతరాయం కలిగించే చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది.