Trump: హర్మూజ్ టోల్ నిర్ణయంపై వెనక్కి తగ్గిన ట్రంప్..
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేయాలన్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క రోజులోనే మార్చుకున్నారు. టోల్ విధింపుకు బదులుగా పశ్చిమాసియా దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం, అలాగే తమ దేశంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పరస్పర సహకారాన్ని పెంచుతాయని మంగళవారం వెల్లడించారు. పశ్చిమాసియా దేశాల నాయకత్వంతో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలకు అమెరికా భద్రత కల్పిస్తుందని,అందుకు ప్రతిఫలంగా సరకు విలువలో 20 శాతం టోల్ వసూలు చేస్తామని సోమవారం ఆయన చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజా నిర్ణయంతో ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు.
వివరాలు
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు
ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఆందోళనకరంగా మారుతున్నాయి.
ఉద్రిక్తతలు పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం కూడా అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు కొనసాగించింది.
ముఖ్యంగా ఆ దేశ తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణి కేంద్రాలు, డ్రోన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది.
దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా అమెరికా మిత్రదేశాలైన బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై దాడులకు పాల్పడింది.
ఇరాన్ నుంచి ప్రయోగించిన నాలుగు క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని జోర్డాన్ సైన్యం ప్రకటించింది.
దీంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులపై అంతర్జాతీయ స్థాయిలో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.