
Trump: భారత్పై ట్రంప్ సుంకాలు అన్యాయం.. అమెరికా మాజీ సలహాదారు!
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని హెచ్చరించినా పట్టించుకోని భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడం ప్రారంభించారు. అయితే ఆయన ఈ నిర్ణయంపై అమెరికా అంతర్గతంగానే విమర్శలు ముదురుతున్నాయి. తాజాగా అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ కూడా ట్రంప్ను ధ్వజమెత్తారు. భారత్ను లక్ష్యంగా చేసుకుని సుంకాలు విధించడం అన్యాయమని బోల్టన్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి విస్తృత స్థాయిలో చమురు దిగుమతులు చేస్తున్న చైనాను వదిలి, కేవలం భారత్పైనే ఆంక్షలు విధించడం ఏంటని ప్రశ్నించారు.
Details
వ్యక్తిగత కక్ష్యతో చేస్తున్న చర్య
ఇది వాణిజ్యం కోసం కాదని, వ్యక్తిగత కక్షతో చేస్తున్న చర్యగా అనిపిస్తోందని బోల్టన్ విమర్శించారు. సరైన ఆలోచన లేకుండా ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అమెరికాకు వ్యూహాత్మకంగా కీలకమైన భాగస్వామి అయిన భారత్ను దూరం చేయవచ్చని బోల్టన్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్, తన స్వలాభం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. అమెరికా రాజకీయాల్లో ఇంతకుముందెప్పుడూ చూడని విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మరలా రాకూడదని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.