Trump: ఖొమైనీ ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు.. తీవ్ర గాయాలయ్యాయి: డొనాల్డ్ ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం త్వరలోనే ముగిసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖొమైనీ తీవ్రంగా గాయపడినప్పటికీ ఇంకా ప్రాణాలతోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఓ కన్జర్వేటివ్ బ్రాడ్కాస్టర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
ఎడమ భాగం, చేయి, కాలు దెబ్బతిన్నాయి
ఖొమైనీ మరణించారని తాను భావించడం లేదని ట్రంప్ చెప్పారు.అయితే ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.
శరీరంలోని ఎడమ వైపు భాగంతో పాటు చేయి,కాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
అయితే ఈ వాదనకు మద్దతుగా ట్రంప్ ఎలాంటి ఆధారాలను వెల్లడించలేదు.
ఇరాన్ అధికారులు కీలక నిర్ణయాల కోసం ఇప్పటికీ ఖొమైనీని సంప్రదిస్తున్నారని, ఇది ఆయన సజీవంగా ఉన్నారనే విషయాన్ని సూచిస్తోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
22 ఇరాన్ బోట్లను ధ్వంసం చేశాం
అమెరికా చేపట్టిన సైనిక చర్యల్లో భాగంగా ఒక్క రాత్రిలోనే ఇరాన్కు చెందిన 22బోట్లను ధ్వంసం చేసినట్లు ట్రంప్ వెల్లడించారు.
అమెరికా నేవీ,సైన్యం సమర్థంగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. ఈ యుద్ధంలో త్వరలోనే తమ దేశం పెద్ద విజయాన్ని సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
వివరాలు
నిరసనలు ఎందుకు లేవంటే..
ఇరాన్ ప్రజలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడం లేదనే ప్రశ్నకు కూడా ట్రంప్ స్పందించారు.
నిరసనకారులపై కాల్పులు జరిపేందుకు అక్కడి సైన్యం, స్నిపర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఈ కారణంగానే ప్రజలు బయటకు వచ్చి ఆందోళనలు చేయడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు.
ఇరాన్ సైనిక శక్తి బలహీనం
ఇరాన్ నావికాదళం, వైమానిక దళం పూర్తిగా నాశనమయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో ఆ దేశం గణనీయంగా బలహీనపడిందని అన్నారు.
ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదించకుండా అడ్డుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
వివరాలు
అణు ఒప్పందంపై నిర్ణయాన్ని సమర్థించుకున్న ట్రంప్
2015లో కుదిరిన ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని కూడా ట్రంప్ సమర్థించుకున్నారు.
ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా నిరోధించడంలో అమెరికా చర్యలు కీలకమని ఆయన పేర్కొన్నారు.