Trump: 'బిగ్ న్యూస్' అంటూ ట్రంప్ సస్పెన్స్.. ప్రైమ్టైమ్ ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో ఉత్కంఠ పెంచారు. ఇవాళ రాత్రి ప్రత్యేక ప్రైమ్టైమ్ ప్రసంగం చేయనున్నట్లు ప్రకటించిన ఆయన.."ఇది నిజంగానే చాలా పెద్ద వార్త" అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఇప్పటికీ వెల్లడించలేదు. వైట్హౌస్ సమాచారం ప్రకారం..ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశించి ఈ ప్రసంగం చేయనున్నారు. దీంతో ఇది యుద్ధానికి సంబంధించిన ప్రకటన కాదని స్పష్టమైంది. అయితే ప్రసంగంలో అమెరికా ఎన్నికల వ్యవస్థ,ముఖ్యంగా 2020 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన కొత్త వివరాలు,ఓటింగ్ యంత్రాల భద్రత వంటి అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల డీక్లాసిఫై చేసిన నిఘా సమాచారాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
మిడ్టర్మ్ ఎన్నికల వేళ రాజకీయ ప్రాధాన్యం
నవంబర్లో జరగనున్న అమెరికా మిడ్టర్మ్ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ ప్రసంగం జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
కాంగ్రెస్లో ఆధిపత్యాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ట్రంప్ తన మద్దతుదారుల్లో మరింత ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు పెంచే ప్రయత్నమే ఇది అని డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు.
వివరాలు
2020 ఎన్నికల వివాదం మళ్లీ తెరపైకి?
2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమి తర్వాత ట్రంప్ ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని పదేపదే ఆరోపిస్తూ వస్తున్నారు.
అయితే ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అనేక దర్యాప్తులు, కోర్టు విచారణలు ఇప్పటికే స్పష్టం చేశాయి.
అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ (CISA) కూడా 2020 ఎన్నికలను దేశ చరిత్రలోనే అత్యంత భద్రమైన ఎన్నికలుగా పేర్కొంది.
అయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం 2020 ఎన్నికలకు సంబంధించిన పలు పత్రాలను సేకరించడం, దర్యాప్తులను కొనసాగించడం,ఓటింగ్ విధానాల్లో మార్పులకు ప్రయత్నించడం వంటి చర్యలను కొనసాగిస్తోంది.
వివరాలు
డెమొక్రాట్లు తీవ్ర అభ్యంతరం
ఓటర్ల గుర్తింపు నిబంధనలను మరింత కఠినతరం చేయడం, మెయిల్-ఇన్ బ్యాలెట్లపై పరిమితులు విధించడం వంటి అంశాలను కూడా ట్రంప్ ముందుకు తీసుకొస్తున్నారు.
ట్రంప్ తాజా ప్రసంగంపై డెమొక్రాట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఆధారంలేని ఎన్నికల ఆరోపణలను మరోసారి ప్రజల ముందుకు తీసుకురావడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీయొద్దని వారు హెచ్చరిస్తున్నారు.
భారత కాలమానం ప్రకారం ట్రంప్ ప్రసంగం శుక్రవారం ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది.