Trump: మంటెత్తుతున్న చమురు ధరలు.. రిఫైనరీ సంస్థల అధిపతులతో ట్రంప్ అత్యవసర భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలతో అమెరికాలో సామాన్యులపై భారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కల్పించే మార్గాలపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం దేశంలోని ప్రముఖ చమురు శుద్ధి సంస్థల అధిపతులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 1న జరగనున్న ఈ భేటీకి మారథాన్ పెట్రోలియం, వాలెరో ఎనర్జీ, చెవ్రాన్, డెలెక్ యూఎస్, పీబీఎఫ్ ఎనర్జీ తదితర ప్రముఖ ఇంధన ఉత్పత్తిదారులు, పంపిణీ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు.
వివరాలు
మిడ్టర్మ్ ఎన్నికల భయం!
అమెరికాలో వచ్చే నవంబరులో కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో పెరుగుతున్న జీవన వ్యయం ట్రంప్ ప్రభుత్వానికి సవాల్గా మారింది.
ఇప్పటికే గాలన్ పెట్రోల్ ధర 4 డాలర్లు, డీజిల్ ధర 6 డాలర్లు దాటడంతో వినియోగదారుల్లో అసంతృప్తి పెరుగుతోంది.
ఎన్నికల సమయంలో ఓటర్ల ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకే ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యలకు శ్రీకారం చుట్టిందని కొందరు విశ్లేషిస్తున్నారు.
ఇటీవల విడుదలైన పలు సర్వేల్లో ట్రంప్ ప్రజాదరణ 33 శాతానికి పడిపోయినట్లు వెల్లడవడం రిపబ్లికన్ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది.
వివరాలు
సామాన్యుడిపై పెరుగుతున్న భారం..
చమురు సంక్షోభం కొనసాగుతున్న సమయంలో ఇంధన కంపెనీలు రెండో త్రైమాసికంలో భారీగా లాభాలు ఆర్జించడంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు.
వినియోగదారులపై అధిక ధరల భారం మోపకుండా.. ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని ఆయన చమురు కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నారు.
అయితే రిఫైనరీల శుద్ధి సామర్థ్యం తగ్గడం, కఠినమైన బయోఫ్యూయెల్ నిబంధనలు తమ కార్యకలాపాలకు అడ్డంకిగా మారుతున్నాయని కంపెనీలు చెబుతున్నాయి.