Typhoon Talim: చైనాను వణిస్తున్న'తాలిమ్ టైఫూన్' తుపాను; విమానాశ్రయాలు, పాఠశాలలు మూసివేత
చైనాను 'తాలిమ్ టైఫూన్' తుపాను వణికిస్తోంది. తుపాను సోమవారం రాత్రికి తీరాన్నితాకనుంది. హైనాన్ నుంచి గ్వాంగ్డాంగ్ వరకు దక్షిణ తీరం వెంబడి తీరం దాటే క్రమంలో తుపాను మరింత బలపడుతుందని చైనా వాతావరణ చెప్పింది. 'టైఫూన్ తాలిమ్' తుపాను తీరాన్ని తాకే సమయంలో దక్షిణ తీరప్రాంతంలో శక్తివంతమైన గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చైనా వాతావరణ యంత్రాంగం తెలిపింది. దీంతో 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. ఉపరితర ఆవర్తనం కారణంగా తుపానుగా మారే దశను 'తాలిమ్' అంటారు. తుపాను అతి తీవ్రమైన తుపానుగా మారిన దశను 'టైఫూన్' అని పిలుస్తారు. అందుకే చైనాలో తాజా వచ్చిన తుపానును 'తాలిమ్ టైఫూన్'గా సంభోదిస్తున్నారు.
250-280 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదయ్యే అవకాశం
గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని ఝాన్జియాంగ్ నగరానికి ఆగ్నేయంగా 375కిమీ దూరంలో టైఫూన్ తాలీమ్ ఉందని, గంటకు 20కిమీ వేగంతో కదులుతోందని చైనా వాతావరణ శాఖ తెలిపింది. టైఫూన్ తుపాను వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హైనాన్, గ్వాంగ్డాంగ్లోని అధికారులకు వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ ప్రావిన్సులకు సమీపంలోని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తాయని, ఉత్తర హైనాన్ ద్వీపం, గ్వాంగ్జీ నైరుతి తీరంలో 250-280 మిల్లీమీటర్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. టైఫూన్ తాలీమ్ తుపాను కారణంగా జుహై జిన్వాన్ విమానాశ్రయం సోమవారం 79విమానాలను రద్దు చేశారు. హైకౌలోని మీలాన్ అంతర్జాతీయ విమానాశ్రయం, కియోంఘై బోవో విమానాశ్రయంలో కూడా అన్ని సర్వీసులను రద్దు చేశారు.
హాంకాంగ్లో స్టాక్ మార్కెట్ మూసివేత
వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా సోమవారం మధ్యాహ్నం నుంచి హైకౌలో పాఠశాలలు, విమానాలు, వ్యాపార కార్యకలాపాలను నిలిపివేశారు. తుపాను ప్రభావం హాంకాంగ్లో స్టాక్ మార్కెట్పై పడింది. రోజంతా స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దక్షిణ చైనా, వియత్నాంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పదివేల మంది ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. తుపాను వల్ల ఫ్లైట్లు రద్దు లేదా ఆలస్యం కావడంతో 1,000 మందికి పైగా ప్రయాణికులు ప్రభావితమయ్యారని హాంకాంగ్ ఎయిర్పోర్ట్ అథారిటీ తెలిపింది. వాతావరణ మార్పులతో ప్రపంచం వేడెక్కుతున్న కొద్దీ టైఫూన్లు మరింత శక్తివంతంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.