కాళీ దేవతపై ఉక్రెయిన్ అనుచిత ట్వీట్; భారతీయులకు క్షమాపణలు చెప్పిన ఆ దేశ మంత్రి
కాళీ దేవత చిత్రాన్ని వక్రీకరిస్తూ ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్కు ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ ఝపరోవా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఎమిన్ ఝపరోవా ట్వీట్ చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ కాళీ దేవతను వక్రీకరిస్తూ కార్టూన్ ట్విట్టర్లో పోస్టు చేసినందుకు ఉక్రెయిన్ పశ్చాత్తాపపడుతోందని ఎమిన్ ఝపరోవా చెప్పారు. ఏప్రిల్ 30న ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ కాళీమాతను వక్రీకరిస్తూ పోస్టు చేసింది. దీనిపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సంస్కృతిని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. భారత సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ఈ చిత్రాన్ని హిందువుల మనోభావాలపై దాడిగా అభివర్ణించారు.
ఒత్తిడితో కాళీమాత ఫొటోను తొలగించిన ఉక్రెయిన్
నెటిజన్లతో పాటు భారత ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ కాళీమాత ఫొటోను తొలగించింది. భారతదేశం నుంచి సాయం కోరిన తర్వాత దేశంలో విస్తృతంగా ఆరాధించే దేవతను అవమానిస్తున్నారని నెటిజన్లు ఉక్రెయిన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎమిన్ ఝపరోవా భారతదేశాన్ని సందర్శించిన కొద్ది రోజులకే రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ట్వీట్ పెట్టడం గమనార్హం. ఫిబ్రవరి, 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశాన్ని సందర్శించిన మొదటి ఉన్నతస్థాయి ఎమిన్ ఝపరోవా కావడం గమనార్హం.