Finland: లక్ష సంవత్సరాల పాటు అణు వ్యర్థాల నిల్వ.. ప్రపంచంలో తొలి దేశంగా ఫిన్లాండ్!
ఈ వార్తాకథనం ఏంటి
అణు విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే రేడియోధార్మిక వ్యర్థాల నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఫిన్లాండ్ కీలక అడుగు వేస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా వినియోగం పూర్తైన అణు ఇంధనాన్ని (Spent Nuclear Fuel) శాశ్వతంగా భూగర్భంలో నిల్వ చేయడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం ఫిన్లాండ్ దక్షిణ పశ్చిమ ప్రాంతంలోని యూరాజోకి (Eurajoki) వద్ద 'ఒంకాలో' (Onkalo) పేరుతో ప్రత్యేక భూగర్భ నిల్వ కేంద్రాన్ని నిర్మించింది. భూమి ఉపరితలం నుంచి సుమారు 433 మీటర్ల లోతులో ఉన్న ఈ కేంద్రం,వేల సంవత్సరాల పాటు అత్యంత రేడియోధార్మిక అణు వ్యర్థాలను సురక్షితంగా నిల్వ ఉంచేలా రూపొందించబడింది.
వివరాలు
జూన్లో తుది పరిశీలన పూర్తి చేయనున్న STUK
ఫిన్లాండ్ అణు భద్రత నియంత్రణ సంస్థ (STUK) జూన్లో తుది పరిశీలన పూర్తి చేయనుంది. అనుమతులు లభిస్తే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అణు వ్యర్థాల నిల్వ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అణు వ్యర్థాల శాశ్వత నిల్వ కోసం దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ,ఎక్కువ దేశాలు ఇప్పటికీ తాత్కాలిక నిల్వ కేంద్రాలపైనే ఆధారపడుతున్నాయి. స్వీడన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఇలాంటి ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నప్పటికీ,భూగర్భ అణు వ్యర్థాల నిల్వ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించే తొలి దేశంగా ఫిన్లాండ్ నిలవనుంది. ఈ ప్రాజెక్టును అణు వ్యర్థాల నిర్వహణ సంస్థ పోసివా (Posiva) అభివృద్ధి చేసింది.
వివరాలు
1.16బిలియన్ డాలర్ల వ్యయం
2004లో ప్రారంభమైన ఈ నిర్మాణ పనులకు దాదాపు 1.16బిలియన్ డాలర్లు వ్యయమైనట్లు అంచనా. ఫిన్లాండ్లోని ఐదు అణు రియాక్టర్ల నుంచి ఉత్పత్తి అయ్యే సుమారు 6,500టన్నుల అణు వ్యర్థాలను నిల్వ చేసే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. మొదట ఒల్కిలువోటో(Olkiluoto)అణు విద్యుత్ కేంద్రంలో నిల్వ ఉన్న వ్యర్థాలను ఇక్కడికి తరలిస్తారు. వాటిని తుప్పు పట్టకుండా ప్రత్యేకంగా తయారు చేసిన రాగి కంటైనర్లలో మూసివేసి,భూగర్భ శిలల్లో తవ్విన గుంతల్లో భద్రపరుస్తారు. ఈ నిల్వ కేంద్రంలో సుమారు 100 సంవత్సరాల పాటు అణు వ్యర్థాలను నిల్వ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. భవిష్యత్తులో కొత్త అణు రియాక్టర్లు నిర్మిస్తే ఈ కాలాన్ని మరింత పొడిగించే అవకాశం ఉంది. కేంద్రం పూర్తిగా నిండిన తర్వాత దానిని శాశ్వతంగా మూసివేస్తారు.
వివరాలు
లక్ష సంవత్సరాల పాటు ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండేలా..
కనీసం లక్ష సంవత్సరాల పాటు ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండేలా దీన్ని రూపొందించారు. అణు వ్యర్థాల కంటైనర్ల చుట్టూ బెంటోనైట్ మట్టి పొరను ఏర్పాటు చేసి అదనపు రక్షణ కల్పించనున్నారు. అలాగే నిల్వ సొరంగాలను ప్రత్యేక కాంక్రీట్ ప్లగ్లతో మూసివేసి లీకేజీ ప్రమాదాలను నివారించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టుపై కొన్ని ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాగి కంటైనర్లకు తుప్పు పట్టడం, భవిష్యత్తులో సంభవించే భూకంపాలు లేదా మంచు యుగాల ప్రభావం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. దాదాపు పది లక్షల సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిపుణులు భద్రతా అధ్యయనాలు నిర్వహించారు.
వివరాలు
ఒంకాలో ప్రాజెక్టు అత్యంత కీలకం
అధికారుల ప్రకారం ఇప్పటివరకు జరిగిన పరీక్షలు, భద్రతా అంచనాలు సానుకూల ఫలితాలను చూపించాయి. ఫిన్లాండ్లో అణుశక్తికి ప్రజల నుంచి గణనీయమైన మద్దతు ఉండటంతో, ఈ ప్రాజెక్టుపై ఇతర యూరోపియన్ దేశాల్లో కనిపించినంత స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అయితే పర్యావరణ సంస్థలు మాత్రం లక్షల సంవత్సరాల పాటు సంపూర్ణ భద్రతకు ఎవరూ హామీ ఇవ్వలేరని హెచ్చరిస్తున్నాయి. అయినప్పటికీ, భవిష్యత్ అణు సాంకేతికతల అభివృద్ధిలో భాగంగా చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (SMRs) వినియోగాన్ని పరిశీలిస్తున్న ఫిన్లాండ్కు ఒంకాలో ప్రాజెక్టు అత్యంత కీలకమని అధికారులు భావిస్తున్నారు.