Page Loader
USA: రష్యాతో విధ్వంసానికి ముప్పు.. యుఎస్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ కంపెనీలకు హెచ్చరిక 
రష్యాతో విధ్వంసానికి ముప్పు.. యుఎస్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ కంపెనీలకు హెచ్చరిక

USA: రష్యాతో విధ్వంసానికి ముప్పు.. యుఎస్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ కంపెనీలకు హెచ్చరిక 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 22, 2024
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో మాస్కో,అమెరికా మధ్య సంబంధాలు మరింత కఠినంగా మారుతున్నాయి. ఈ క్రమంలో రష్యా, అమెరికా రక్షణ సంస్థలపై దాడులు చేయవచ్చని ఆ దేశ ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. "రష్యా ఐరోపాలో నిర్వహిస్తున్న విధ్వంసకర చర్యలు అమెరికాకు చెందిన రక్షణ సంస్థలకు ప్రమాదకర పరిస్థితులు సృష్టించాయి. ఇటువంటి ఘటనలు భయం, అనుమానాలు కలిగించడంతో పాటు మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపుతాయి. వాణిజ్యానికి అంతరాయం కలిగించి ప్రాణ నష్టం కూడా జరగవచ్చు," అని ఆ ప్రకటనలో పేర్కొంది.

వివరాలు 

రష్యా డిఫెన్స్‌ కంపెనీలపై దాడులు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో కీవ్‌కు మద్దతు అందిస్తున్న అమెరికా రక్షణ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రకటన సూచించింది. తమ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సంస్థలకు సూచనలు ఇచ్చింది. అత్యంత ముఖ్యంగా యూకే, పోలాండ్‌లలోని నేరస్థులను ఉపయోగించి రష్యా డిఫెన్స్‌ కంపెనీలపై దాడులకు పాల్పడుతోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జర్మనీలో ఒక కొరియర్‌ హబ్‌, ఇంగ్లాండ్‌లో ఒక గిడ్డంగిలో మంటలు చెలరేగాయి. అలాగే ఉత్తర అమెరికాకు వెళ్లే కార్గో విమానాల్లో ప్రమాదకర వస్తువులను రవాణా చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆరోపణలు వచ్చాయి. అయితే, మాస్కో ఈ ఆరోపణలను ఖండించింది.

వివరాలు 

అమెరికా ఆంక్షలు

ఇక మరోవైపు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాలు వాడటానికి కీవ్‌కు అనుమతి ఇవ్వడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. రష్యా దీన్ని ప్రతిగా తమ అణ్వాయుధ వ్యూహాలను సవరించింది. క్షిపణి దాడులకు కీవ్‌ కూడా రష్యా భూభాగాన్ని టార్గెట్ చేస్తోంది. ఈ భయంతో కీవ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని ఖాళీ చేశారు. గురువారం రష్యా ఉక్రెయిన్‌పై ఖండాంతర క్షిపణి దాడి చేయడమే కాకుండా, అవసరమైతే ఇతర దేశాలపైనా ఇలాంటి దాడులు చేస్తామని హెచ్చరించింది. మరోవైపు, రష్యా గాజ్‌ప్రోమ్‌బ్యాంక్‌ సహా ఆరు విదేశీ అనుబంధ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడం ద్వారా పరిస్థితులు మరింత కఠినంగా మారాయి.