LOADING...
US: రెండు రోజుల్లో 170 లక్ష్యాలపై అమెరికా దాడులు.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత

US: రెండు రోజుల్లో 170 లక్ష్యాలపై అమెరికా దాడులు.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2026
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై అమెరికా గురువారం తెల్లవారుజామున భారీ స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ పశ్చిమాసియాలోని అమెరికా మిత్రదేశాలపై క్షిపణి దాడులకు దిగింది. దీంతో ఇటీవల కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ప్రారంభమైన పరస్పర దాడులు గురువారం మరింత ఉధృతమవడంతో పశ్చిమాసియా అంతటా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడుల నేపథ్యంలో ప్రాంతంలోని పలు దేశాల్లో హెచ్చరిక సైరన్లు మార్మోగాయి. అమెరికా నౌకాదళానికి చెందిన ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఉన్న బహ్రెయిన్‌లో కనీసం మూడు సార్లు సైరన్లు మోగాయి. అలాగే కువైట్, ఖతార్‌లను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరిగినట్లు సమాచారం.

వివరాలు 

దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా పేలుళ్లు

అమెరికా సైనిక బలగాలు, యుద్ధ విమానాలు మోహరించి ఉన్న జోర్దాన్‌లో కూడా గురువారం మధ్యాహ్నం అప్రమత్త హెచ్చరికలు జారీ చేస్తూ సైరన్లు మోగించారు. ఇదే సమయంలో ఇరాన్‌లోని ఏకైక అణువిద్యుత్ కేంద్రం పరిసర ప్రాంతాలపై అమెరికా వైమానిక దాడులు జరిగాయని ఇరాన్ అధికారులు ఆరోపించారు. అంతేకాకుండా దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా పేలుళ్లు సంభవించినట్లు స్థానికమీడియా వెల్లడించింది. భారత్ సహకారంతో అభివృద్ధి చేస్తున్న చాబహార్ పోర్టు ప్రాంతంపైనా అమెరికా దాడులు జరిగినట్లు ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. గత రెండురోజుల్లో మొత్తం 170లక్ష్యాలపై అమెరికా దాడులు నిర్వహించినట్లు సమాచారం. హొర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులతో కాల్పుల విరమణ ఒప్పందం అమలులో లేకుండా పోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.

వివరాలు 

ఖమేనీకి ఫైటర్ జెట్ ఎస్కార్ట్‌తో అంతిమ వీడ్కోలు

ఇరాన్ తన దాడులను నిలిపివేయకపోతే ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించిన కొద్ది గంటల్లోనే అమెరికా ఈ వైమానిక దాడులను చేపట్టడం గమనార్హం. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతదేహాన్ని ఇరాక్ నుంచి ఫైటర్ జెట్ భద్రతా ఎస్కార్ట్ మధ్య ఇరాన్‌కు తరలించారు. అనంతరం గురువారం సాయంత్రం మషాద్ నగరంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. ఖమేనీకి తుది వీడ్కోలు పలికేందుకు లక్షలాది మంది ప్రజలు మషాద్‌కు చేరుకుని ఇరాన్ జెండాలు చేతబట్టి నివాళులర్పించారు. ఖమేనీతో పాటు ఆయన మనవరాలు, కుమార్తె, అల్లుడు, అలాగే మొజ్తబా ఖమేనీ భార్యను కూడా అదే సందర్భంగా ఖననం చేసినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు.

Advertisement