Loading...
UKs first AI minister: యూకేలో తొలి ఏఐ మంత్రిగా కనిష్క నారాయణ్‌.. మరోసారి లీసా నాండీకి ఛాన్స్
యూకేలో తొలి ఏఐ మంత్రిగా కనిష్క నారాయణ్‌.. మరోసారి లీసా నాండీకి ఛాన్స్

UKs first AI minister: యూకేలో తొలి ఏఐ మంత్రిగా కనిష్క నారాయణ్‌.. మరోసారి లీసా నాండీకి ఛాన్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రిగా ఆండీ బర్న్‌హామ్‌ (56) బాధ్యతలు స్వీకరించడంతో ఆయన తొలి మంత్రివర్గంలో భారతీయ మూలాలున్న ఇద్దరు నేతలకు కీలక బాధ్యతలు లభించాయి. వేల్స్‌ నుంచి ఎంపీగా ఎన్నికైన కనిష్క నారాయణ్‌కు యూకే తొలి కృత్రిమ మేధ (ఏఐ) మంత్రిగా అవకాశం దక్కగా, లీసా నాండీకి మరోసారి సాంస్కృతిక శాఖ మంత్రి పదవి కేటాయించారు.

వివరాలు 

యూకే తొలి ఏఐ మంత్రిగా కనిష్క

ఇప్పటికే కీర్‌ స్టార్మర్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కనిష్క నారాయణ్‌ ఆన్‌లైన్‌ భద్రత, కృత్రిమ మేధకు సంబంధించిన విభాగాలను పర్యవేక్షించారు.

ప్రస్తుతం ఆయనను పూర్తిస్థాయి ఏఐ మంత్రిగా నియమించారు.

ప్రభుత్వ విధానాల రూపకల్పన, అమలులో కృత్రిమ మేధకు మరింత ప్రాధాన్యం కల్పించాలనే నిర్ణయం నేపథ్యంలో ఈ పదవిని ఏర్పాటు చేసి ఆయనకు అప్పగించారు.

బిహార్‌లో జన్మించిన కనిష్క నారాయణ్‌ ఉన్నత విద్యను విదేశాల్లో అభ్యసించారు.

ఆయన లింక్డిన్‌ వివరాల ప్రకారం ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం, ఆర్థికశాస్త్రంలో విద్యనభ్యసించారు.

అనంతరం స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన ఆయన, 2025లో తొలిసారిగా మంత్రి పదవిని చేపట్టారు.

వివరాలు 

బెంగాల్‌తో లీసా నాండీకి అనుబంధం

లీసా నాండీ మాంచెస్టర్‌లో జన్మించారు. ఆమె తండ్రి దీపక్‌ నాండీ పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు కాగా, తల్లి బ్రిటిష్‌ జాతీయురాలు.

2010 నుంచి విగాన్‌ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న లీసా నాండీ, కీర్‌ స్టార్మర్‌ ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా సేవలందించారు.

కొత్త ప్రభుత్వంలోనూ అదే శాఖ బాధ్యతలను మరోసారి ఆమెకు అప్పగించారు.

ADVERTISEMENT