Page Loader
Two wheeler ABS: వచ్చే ఏడాది నుంచి టూవీలర్లన్నింటికీ ఇక ABS తప్పనిసరి!
వచ్చే ఏడాది నుంచి టూవీలర్లన్నింటికీ ఇక ABS తప్పనిసరి!

Two wheeler ABS: వచ్చే ఏడాది నుంచి టూవీలర్లన్నింటికీ ఇక ABS తప్పనిసరి!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2025
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ద్విచక్ర వాహన ప్రమాదాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.

దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ప్రతి టూవీలర్‌లోనూ 'యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌' (ఏబీఎస్‌) అమలును తప్పనిసరి చేయాలనే ఆలోచనతో ముందడుగు వేసింది.

వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచే ఈ కొత్త నిబంధనను అమల్లోకి తేనున్నట్లు సమాచారం.

ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ త్వరలో విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

ప్రస్తుతం ఏబీఎస్‌పై అమలవుతున్న నిబంధనలు 

ఇప్పటికీ భారత్‌లో 150 సీసీకి మించిన ఇంజిన్ సామర్థ్యం కలిగిన ద్విచక్ర వాహనాలకే ఏబీఎస్‌ విధానం అనివార్యంగా అమలవుతోంది.

అయితే కేంద్రం తాజా ప్రతిపాదన ప్రకారం, ఇకపై బేసిక్ మోడళ్లను కూడా ఈ నిబంధన పరిధిలోకి తీసుకురానుంది.

దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న టూవీలర్లలో దాదాపు 75 శాతం వరకు ఎంట్రీ లెవల్ మోడళ్లే ఉన్నాయి.

2022లో నమోదైన రోడ్ యాక్సిడెంట్లలో సుమారు 20 శాతం వరకు ప్రమాదాలు టూవీలర్ల వల్లే చోటుచేసుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

వివరాలు 

ధరల పెరుగుదలకు కారణం ఏమిటి? 

ఏబీఎస్‌ను తప్పనిసరిగా అమలు చేయాలంటే, వాహనాల తయారీదారులకు అదనపు ఖర్చు అవుతుంది.

దీని ప్రభావం నేరుగా వినియోగదారులపై పడనుంది. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం, ఎంట్రీ లెవల్ టూవీలర్ మోడళ్ల ధరలు రూ.2,500 నుంచి రూ.5,000 వరకు పెరిగే అవకాశం ఉంది.

అయినప్పటికీ, ప్రమాద నివారణలో ఏబీఎస్‌ కీలక పాత్ర పోషించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

ఏబీఎస్‌ అంటే ఏమిటి? 

ఏబీఎస్‌ అనగా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌. ఇది వాహనాలకు చెందిన ఒక రకమైన భద్రతా సాంకేతికత.

అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చిన సందర్భంలో చక్రాలు లాక్ అవకుండా ఉండేలా ఇది పనిచేస్తుంది.

వాహనంపై డ్రైవర్‌కు నియంత్రణ కోల్పోకుండా చేస్తుంది. దీంతో వాహనం స్కిడ్‌ కావడం లేదా అదుపు తప్పే ప్రమాదం తక్కువ అవుతుంది.

వాహన దృఢతను మెరుగుపరిచే ఈ సాంకేతికత రోడ్డు ప్రమాదాల నివారణలో ఎంతో ఉపయోగపడుతుంది.