Ather price hike: ఏథర్ స్కూటర్ కొనాలనుకునేవారికి హెచ్చరిక… జనవరి నుంచి రేట్లు పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తమ స్కూటర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.3 వేల వరకు ధర పెరుగుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ పెరిగిన ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం, అంతర్జాతీయంగా అవసరమైన ముఖ్యమైన ఎలక్ట్రానిక్ భాగాల ఖర్చు అధికమవడం, అలాగే ఫారెక్స్ మార్పుల ప్రభావం కారణంగా ధరల సవరణ తప్పనిసరిగా చేయాల్సి వచ్చిందని ఏథర్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఏథర్ సంస్థ 450 సిరీస్లో పెర్ఫార్మెన్స్ స్కూటర్లను, అలాగే 'రిజ్తా' పేరుతో ఫ్యామిలీ స్కూటర్లను మార్కెట్లో విక్రయిస్తోంది.
వివరాలు
'ఎలక్ట్రానిక్ డిసెంబర్' పేరుతో ప్రత్యేక ఆఫర్
ఈ స్కూటర్ల ధరలు రూ.1,14,546 నుంచి ప్రారంభమై రూ.1,82,946 వరకు ఉన్నాయి. అయితే ధరల పెంపు ప్రతి మోడల్కు వేరువేరుగా ఉండనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం 'ఎలక్ట్రానిక్ డిసెంబర్' పేరుతో ప్రత్యేక ఆఫర్ను కొనసాగిస్తున్నామని ఏథర్ తెలిపింది. ఈ స్కీమ్ ద్వారా ఎంపిక చేసిన నగరాల్లో ఏథర్ స్కూటర్ కొనుగోలుపై రూ.20 వేల వరకు లాభాలను వినియోగదారులకు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో ఇప్పటికే పలు ఆటో మొబైల్ కంపెనీలు కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇదే తరహాలో ఇతర ద్విచక్ర వాహనాలు, విద్యుత్ వాహనాల తయారీ సంస్థలు కూడా త్వరలో ధరలు పెంచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.